తిరువూరు: ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తెలుగుదేశం నాయకులు తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని గురువారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు రాజుపేటలో టీడీపీ నాయకుడు షేక్ షాహిన్ పాషా రేకుల షెడ్డులో 4,200 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. మద్యం నిల్వ చేసిన టీడీపీ నాయకులు షాహిన్ పాషా, జీనుగు అశోక్, మోదుగు వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. గంపలగూడెం మండలం కొత్తపల్లిలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న వంగల నాగేశ్వరరావు నుంచి తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భారీగా మద్యం పట్టివేత
నందిగామ: అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం సీసాలను గురువారం తెల్లవారుజామున నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ హనీష్ తెలిపిన సమాచారం ప్రకారం చందర్లపాడుకు చెందిన తలమాల మోహన్రావు అనే వ్యక్తి గూడ్స్ ఆటోలో 2,850 మద్యం సీసాలను నందిగామకు తీసుకువస్తున్నాడు. స్థానిక డీవీఆర్ కాలనీ సమీపంలోకి రాగానే గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ మద్యం తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.