ములకలపల్లి: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. ఎవరు ఏం అనుకుంటారోనన్న కనీస ఆలోచన లేకుండా మద్యం మత్తులోనే పాఠశాలకు రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆయనను తీసుకెళ్లి పశువుల పాకలో పడుకోబెట్టారు. మండలంలోని తిమ్మంపేట గ్రామపంచాయతీ పరిధి రాజీవ్నగర్ కాలనీ ప్రాఽథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పత్తిపాటి వీరయ్య శుక్రవారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో వీరయ్య అతిగా మద్యం సేవించి తూలుతూ పాఠశాలకు రాగా.. విద్యార్థులు ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు చేరుకుని ఆయనను మోసుకెళ్లి సమీపంలోని పశువుల కొట్టంలో పడుకోబెట్టారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే ఉన్న వీరయ్య.. ఆ తర్వాత లేచి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఇన్చార్జ్ ఎంఈఓ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుడిని పశువుల పాకలో పడుకోబెట్టిన స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment