![వెయ్యేళ్ల విగ్రహాలు.. చరిత్రకు సాక్ష్యాలు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25knt180-180027_mr.jpg.webp?itok=RnvFubos)
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులో వెయ్యేళ్ల నాటి దేవతల రాతి విగ్రహాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. కాకతీయుల కాలం నాటి చరిత్రకు ఆనవాళ్లుగా రాతి శిల్పాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నాలుగు నూర్ల గుడులతో నగునూరుగా మారిన ఈ గ్రామంలో ఇంకా రాతి విగ్రహాలు బయటపడుతుండటం విశేషం. స్థానికుల కథనం ప్రకారం.. నగునూరు పంచాయతీ పరిధి పాపగారిపల్లె గుట్టపై పురాతన విగ్రహాలున్నాయనే సమాచారంతో కొందరు హనుమాన్ దీక్షాపరులు శనివారం గుట్టపైకి వెళ్లారు. ఒక పెద్ద బండపై నాలుగు చేతుల్లో ఢమరుకం, త్రిశూలంతో ఉన్న శివుని విగ్రహం, నాట్యం చేస్తున్న దేవత విగ్రహంతోపాటు నాగదేవత శిల్పాలు కన్పించాయి. బండరాళ్లపై చెక్కిన ఈ విగ్రహాలకు హనుమాన్ భక్తులు రంగులు వేసి క్షీరాభిషేకం చేశారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలో ఆలయం ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు.