● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు
కరీంనగర్కల్చరల్: హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 10న రాష్ట్రస్థాయి ఉపాధిహామీ సదస్సు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు తెలిపారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో శుక్రవారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి సీతక్క, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చుతోందన్నారు. ఈజీఎస్ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజూ రూ.600 కూలి చెల్లించాలని, ఏడాదిలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, పనిచేసే చోట నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు, పనిముట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంల అనేకమంది పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారని, వాటికి పట్టాలిచ్చి స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అందులో డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గన్నేరం నర్సయ్య, మాతంగి శంకర్, రాయికంటి శ్రీనివాస్, చిలకబాబు, సుంకరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.