మేకను కాపాడబోయి అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

మేకను కాపాడబోయి అనంతలోకాలకు

Published Thu, Apr 18 2024 10:00 AM | Last Updated on Thu, Apr 18 2024 10:00 AM

సాయికృష్ణ(ఫైల్‌) - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మందలోని ఓ మేక ప్రమాదవశాత్తు చెరువులో పడగా..దానిని కాపాడే ప్రయత్నంలో మేకల కాపారి ఊపిరాడక మృతిచెందాడు. శ్రీరామ నవమి పండుగ రోజు ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మేకను కాపాడబోయి ఎంతో భవిష్యత్‌ ఉన్న యువకుడు మరణించడం అందరిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిర్యాల్‌కర్‌ సాయికృష్ణ(25) స్థానిక గిద్దె చెరువులో పడి బుధవారం మృతి చెందాడు. రోజు మాదిరిగానే సాయికృష్ణ మేకలను మేపడానికి గిద్దెచెరువు ప్రాంతానికి వెళ్లాడు. ఈక్రమంలో మందలోని ఒక మేక ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆ మేకను కాపాడేందుకు సాయికృష్ణ చెరువులోకి దిగగా.. మేక చిక్కుకున్న ఊబిలోనే పడి ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో సాయికృష్ణ కేకలు వేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో చెరువులోనే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమాకాంత్‌ సంఘటన స్థలానికి వెళ్లి చెరువులోంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. సాయికృష్ణ మరణవార్త విని కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. పండుగపూట కొడుకు మరణించడంతో ఆ తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతునికి తల్లితండ్రులు లక్ష్మిబాయి–కిషన్‌, సోదరులు వినిత్‌, దేవిలాల్‌ ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్‌ తెలిపారు.

గిద్దె చెరువులో పడి యువకుడి మృతి

పండుగపూట విషాదం

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement