సాక్షి, కామారెడ్డి: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఎన్కౌంటర్లో 29 మంది మృత్యువాతపడగా.. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత మావో యిస్ట్లు ఉన్నారన్న ప్రచారం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పది మందికిపైగా మావోయిస్ట్లు అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా దండకారణ్యంలోనే పనిచేస్తున్నారని సమాచారం. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడికి చెందిన లోకోటి చందర్ అలియాస్ స్వామితో పాటు ఆయన కుమారుడు రమేశ్, కూతురు లావణ్య, పాల్వంచ మండలం ఆరేపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి, సదాశివనగర్ మండలానికి చెందిన మరొకరు అజ్ఞాతంలో కొనసాగుతున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా వారంతా అజ్ఞాతంలోనే పనిచేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కూడా పలువురు అజ్ఞాతంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరగడం, మృతుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వారున్నారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతుల వివరాలు తెలుసుకోవడానికి చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించారు.