జిల్లావ్యాప్తంగా ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో సాధారణ ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రి చలి తీవ్రంగా ఉంటుంది.
పకడ్బందీగా
పోలింగ్ విధులు
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
భవేష్మిశ్రా
భూపాలపల్లి అర్బన్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా అన్నారు. పోలింగ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం అంబేడ్కర్ స్టేడియంలో సెక్టార్ అధికారులు, పోలింగ్ అధికారులతో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా భవేష్మిశ్రా మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి అప్పగించడం నుంచి పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి అప్పజెప్పడం వరకు చురుకై న పాత్ర పోషించాలని అన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటుచేసే డిస్టిబ్య్రూషన్ కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పోలింగ్ సిబ్బంది కోసం తాగునీరు, టాయిలెట్ల, పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్తో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి భోజన వసతులు కల్పించాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి పంపిణీచేసే సమయంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎంలను సరిచూసి అందజేయాలన్నారు. రిజర్వ్ పోలింగ్ సామగ్రి, ఈవీఎంల సెక్టార్ అధికారుల వద్ద ఉంటాయని తెలిపారు. పోలింగ్ సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులు రిజర్వ్ ఈవీఎంలతో భర్తీచేయాలని అన్నారు. పోలింగ్ రోజున సెక్టార్ అధికారులు ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి తరలించడానికి వీలులేదని చెప్పారు. ప్రభుత్వ వాహనాల్లో పోలీస్ భద్రత మధ్య సెక్టార్ అధికారులు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి మాక్ పోలింగ్ నివేదిక, పోలింగ్ ప్రారంభం నివేదిక, ప్రతి 2గంటలకు పోలింగ్ శాతం వివరాలను సకాలంలో అందజేసేలా సెక్టార్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ కేంద్రాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఇక్కడ అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి రిటర్నింగ్ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.