భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో బూత్ లెవల్ అధికారుల ద్వారా ఓటరు స్లిప్పుల పంపిణీ చేపడుతున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డులతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని బీఎల్ఓలకు ఓటరు సమాచార స్లిప్పులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఓటరుకు పోల్ చీటీలు అందజేస్తామని తెలిపారు. ప్రతి పోల్ స్లిప్పుపై బార్ కోడ్ ముద్రించి ఉంటుందన్నారు. దాన్ని స్కాన్ చేస్తే పోలింగ్ కేంద్రం పూర్తి వివరాలు ప్రత్యక్షం అవుతాయని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 317 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు 2,73,633 స్లిప్పులకు గాను 1,55,426 స్లిప్పులు 56.87శాతం పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో స్లిప్పుల పూర్తిగా పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ చీటీతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 15 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని ఓటర్లు ఈ నెల 30న జరిగే పోలింగ్ కేంద్రానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటలలోపు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా