● వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ క్రైం: సైబర్ నేరాల ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్ సిబ్బందితో బుధవారం ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై వారియర్స్, పెండింగ్ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్ది అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో ఆర్థికనేరాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచేస్తున్నారన్నారు. వీటిని నియంత్రించాలంటే ముందుగా సైబర్ నేరాలు జరిగే తీరుతెన్నులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 1930కి సమాచారం అందించేలా చూడాలన్నారు. సైబర్ క్రైమ్స్ ఏసీపీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.