మెట్పల్లిరూరల్: తాటిచెట్టుపై నుంచి జారి పడి ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మనగర్ గ్రామానికి చెందిన చిలివేరి మల్లేష్ అనే గీత కార్మికుడు బుధవారం తాటిచెట్టు ఎక్కి కిందికి దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా కిందికి జారి పడ్డాడు. కింది భాగంలో ఉన్న తాటి మొద్దును గుద్దుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. కాళ్లు, చేతులు, దవడ భాగంలో గాయాలు కాగా.. మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మద్యం పట్టివేత
కథలాపూర్: మండల కేంద్రం నుంచి మెట్పల్లి మండలం ఆత్మకూర్ వైపు అక్రమంగా మద్యం తరలిస్తుండగా బుధవారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. కథలాపూర్కు చెందిన అజయ్ రూ.8,200 విలువ గల మద్యం తీసుకెళ్తూ కనిపించారు. మద్యం స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రూ.లక్ష నగదు పట్టివేత
రాయికల్: ఒడ్డెలింగాపూర్ చెక్పోస్టు వద్ద బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఓ వ్యక్తి రూ.లక్ష నగదు ఎలాంటి రశీదు లేకుండా తీసుకెళ్తుండగా జప్తు చేసి జగిత్యాలలోని గ్రీవెన్స్సెల్కు అప్పగించినట్లు ఎస్సై అజయ్ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో బుధవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కొద్ది రోజులుగా కొత్త బస్టాండ్తో పాటు పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం కొ త్త బస్టాండ్లో మృతిచెంది ఉండటంతో పట్టణ పోలీసులు మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. వయస్సు 50– 55 సంవత్సరాలుంటుందని పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం: అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు య త్నించిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కోమటికొండాపూర్కు చెందిన రాయేడి గంగారెడ్డి(30) అనే యువకుడు ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇందుకోసం పలువురి దగ్గర అప్పులు చేశాడు. అక్కడ ఆరోగ్యం సహకరించకపోవడంతో మూడు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అప్పులు తీర్చే మార్గం లేక మానసికంగా బాధపడేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు మొదట మెట్పల్లిలోని ఆసుపత్రికి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు. తండ్రి పెద్ద రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
విద్యార్థిని బలవన్మరణం
కోరుట్లరూరల్: పట్టణంలోని బిలాల్పురాకు చెందిన అస్రిన్ బేగం(14) అనే విద్యార్థిని బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. షేక్హైదర్–సుల్తానా బేగం దంపతుల కూతురు అస్రిన్ బేగం స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. 5రోజులుగా పాఠశాలకు వెళ్లటం లేదు. తల్లి పాఠశాలకు వెళ్లమని మందలించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.