గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రయ్మంటూ పరుగులు తీస్తున్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంధనం అవసరం లేకుండా.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 60 కిలో మీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్ బైక్ల వినియోగానికి సిటీజనులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా సగటు వేతన జీవులు ఎలక్ట్రిక్ బైక్లను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం గ్రేటర్లో సుమారు 1.20 లక్షలకు పైగా ఈ–బైక్లున్నట్లు సమాచారం. మూడేళ్లుగా వీటి దూకుడు పెరిగినట్లు రవాణా అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్లకు ఇటీవల భారీగా డిమాండ్ పెరిగిన దృష్ట్యా.. కొనుగోలుదారులు కనీసం రెండు నుంచి మూడు నెలల ముందే వాహనాలను బుక్ చేసుకోవాల్సి వస్తోంది.