లాలాపేట: ఓటింగ్ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు, నూతన పద్ధతులు అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా ఓటు హక్కు పొందిన నవయువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పోలింగ్ బూత్లను ‘స్పెషల్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్’ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ నియోజక వర్గంలో మొత్తం 224 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని 210వ బూత్ను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 750కి పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే అయోమయానికి గురికాకుండా అక్కడ నియమించిన రిసెప్షనిస్టులు ఆహ్వానం పలుకుతూ గైడ్ చేస్తారు. అక్కడ విధుల్లో ఉండే యువ అధికారులు వారికి ఏ క్యూలో వెళ్లాలి, ఏ విధంగా ఓటు వేయాలనే అంశాలను వివరించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తారు. ఇక్కడి వచ్చే యువ ఓటర్లను ఆకర్షించేలా ఓటు ప్రాముఖ్యతను తెలిపే బ్యానర్లు, పోస్టర్లతో అలకరిస్తారు.