నల్లబెల్లి: బ్యాంక్ రుణం కావాలంటే అధికారులు పలు షరతులు విధిస్తారు. అందుకు అవసరమైన పూర్తి డాకుమెంట్స్ అందించాలని కోరుతారు. ఆపై వెరిఫికేషన్ పూర్తి చేసి సంతృప్తి చెందిన తరువాతే రుణం మంజూరు చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మృతి చెందిన వ్యక్తికి బుల్లెట్ (రాయల్ ఎన్ఫీల్డ్) బండికి ఖమ్మం బ్రాంచ్కి చెందిన కొటాక్ మహీంద్రా బ్యాంక్ రుణం మంజూరు చేసింది. వాయిదాలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన భూక్య సునీత, నగేష్ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాకేష్ 2022, జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, కోటక్ మహేంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు.. 2023 అక్టోబర్ 18న భూక్య రాకేష్ పేరుమీద రాయల్ ఎన్ఫీల్డ్–350 ద్విచక్ర వాహనానికి సుమారు రూ.3 లక్షల రుణం మంజూరు చేశారు. ఇందుకు రూ.7,150 చొప్పున 48 నెలలపాటు కిస్తీలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు మూడు వాయిదాలు చెల్లించాడు. ఆ తరువాత వాయిదాలు చెల్లించకపోవడంతో రుణం రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. వాయిదా బకాయి డబ్బులు చెల్లించాలని కోరారు. రెండున్నరేళ్ల క్రితం మృతిచెందిన తమ కుమారుడికి రుణం ఎలా ఇచ్చారని వారిని నిలదీశారు. తీసుకున్న వ్యక్తి వివరాలు తెలియజేసేవరకు ఇక్కడినుంచి కదలనియ్యమని చుట్టుముట్టారు. రుణం తీసుకుని ఇలా ఎందుకు బుకాయిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నించగా, చనిపోయి రెండున్నరేళ్లు అవుతుందని చెప్పితే అర్థంకావడం లేదని స్థానికులు ఉద్యోగులను మందలించారు. పోలీసుల కు సమాచారం అందించి ఉద్యోగులను అప్పగించా రు. మృతిచెందిన తన కుమారుడి పేరిట రుణం మంజూరు చేసిన అధికారులు, తీసుకున్న వ్యక్తి, దళారులను గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరా రు. కాగా, నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి.. చనిపోయిన రాకేష్ పేరు మీద తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో బ్యాంక్ సిబ్బంది, దళారుల పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రుణం కిస్తీ చెల్లించాలని మృతుడి ఇంటికి చేరుకున్న కలెక్షన్ మేనేజర్
రుణం ఎప్పుడిచ్చారని నిలదీసిన
మృతుడి కుటుంబ సభ్యులు
వరంగల్ జిల్లాలో ఘటన