బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: మహా నగర పరిధి చెరువు కట్టలు, పరిసర ప్రాంతాలు పచ్చదనంతో పరిఢవిల్లాలని, ఆదిశగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలని, ఔషధ గుణాలు/పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఎకో ఫ్రెండ్లీ లక్షణాలున్న మొక్కల ఎంపికకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. నగర వ్యాప్తంగా 7 నర్సరీల్లో ఈఏడాది మొత్తం మొక్కల లక్ష్యం 5 లక్షలు కాగా.. ప్రస్తుతం నర్సరీల్లో సిద్ధం చేసిన మొక్కలు 1.80 లక్షలు కాగా.. మొత్తం 3.30 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు ఉద్యానవన అధికారి వివరించారు. సమావేశంలో హార్టికల్చర్ అధికారి రమేశ్, అసిస్టెంట్లు ప్రిన్సి, అశ్విని, ప్రవళిక, అనూహ తదితరులు పాల్గొన్నారు.