విద్యారణ్యపురి : వైద్యవిద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్–2024( నేషనల్ ఎల్జిబులిటి ఎంట్రెన్స్ టెస్టు) ఈనెల 5న(ఆదివారం) నిర్వహించనున్నారు. ఆఫ్లైన్లోనే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఉమ్మడి వరంగల్జిల్లా కేంద్రంలో నీట్కు సర్వసిద్ధం చేశారు. ఈ పరీక్షకు 5,205మంది విద్యార్థులు రాయనుండగా, ఇందుకు తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 9మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించగా, 19మంది అబ్జర్వర్లు పర్యవేక్షించబోతున్నారు. స్క్వాడ్ బృందాలు కూడా ఉంటాయని సమాచారం. నీట్ పరీక్ష ఈనెల 5న(ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం5 గంటల 20 నిమిషాల వరకు జరగనుందని ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్, హనుమకొండలోని గ్రీన్వుడ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సి.మంజులా దేవి శుక్రవారం తెలిపారు. ఉదయం 11:30గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30గంటలకు మెయిన్ గేట్లోకి వెళ్లేందుకు చివరి సమయం అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోరు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.
పరీక్ష కేంద్రాలు ఇవే..
మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజి, వరంగల్ పబ్లిక్ స్కూల్ , సేయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ(హనుమకొండ) ఎస్ఆర్ ప్రైమ్ (వరంగల్), హనుమకొండ హంటర్రోడ్డులోని అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు సైన్సెస్, గ్రీన్వుడ్ హైస్కూల్ (హసన్పర్తి), ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (భీమారం) ఉన్నాయి.
పలు నిబంధనలు..
పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోరు. విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రీస్కింగ్ ఉంటుంది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. షూస్తో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించకూడదు. విద్యార్థినులు ఆభరణాలతోపాటు మెహందీ కూడా పెట్టుకొని రాకూడదు. సంప్రదాయ దుస్తులు వేసుకొని రావాల్సింటుంది. ప్రతి పరీక్ష కేంద్రంలోను ఎన్టీఏ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రంలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎవరూ కూడా సెల్ఫోన్లు తీసుకుపోకూడదు. సెల్ఫోన్లు పనిచే యకుండా పరీక్షాకేంద్రాల్లో జామర్లను కూడా ఏర్పాటుచేశారు. మొత్తంగా ఎన్టీఏ పర్యవేక్షణలోనే నీట్ పరీక్ష పకడ్బందీగా జరగనుంది.
పకడ్బందీగా ఏర్పాట్లు
నీట్ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఎన్టీఏ చేసింది. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ఫ్రూప్ వెంట తీసుకు రావాల్సి ఉంటుంది. ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 11:30గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. నిర్దేశించిన సమయానికి నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించబోరు.
– సి.మంజులాదేవి, నీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్షకు హాజరుకానున్న 5,205 మంది విద్యార్థులు
ఉమ్మడిజిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు
ఉదయం 11:30గంటల నుంచే అనుమతి
సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహణ