తాడికొండ: సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య కోరారు. స్థానిక ఈఆర్వో కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎంపీ అభ్యర్థితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ప్రజల కోసం 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలను ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల ఖాతాల్లోకి చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని చెప్పారు. ఒక్క సారి రెండు బటన్లు నొక్కి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించమని జననేత వైఎస్ జగన్ అడుగుతున్నారని, ప్రజలందరూ ఆశీర్వదించాలని సుచరిత పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరువయ్యారని, అందుకే ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ ఆశీర్వదం అందిస్తున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొని నామినేషన్లో పాల్గొనడం చూస్తే విజయం ఖాయమనే సంకేతాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మాయ చేయడానికి, దుష్ప్రచారం చేయడానికే పనికొస్తున్నారే తప్ప గతంలో వారు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితితో కూటమి ఎన్నికలకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
తాడికొండ అసెంబ్లీ అభ్యర్థి మేకతోటి సుచరిత, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య