గుంటూరు రూరల్: కలిసికట్టుగా పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మైనారిటీలంతా సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఖాదర్బాషా పిలుపు నిచ్చారు. గురువారం వై.జంక్షన్ సమీపంలోని ఒక హోటల్లో జరిగిన మైనారిటీ విభాగం ఆత్మీయ సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్, మైనారిటీ విభాగం జోనల్ ఇన్చార్జ్, జిల్లా వక్ఫ్బోర్డ్ చైర్మన్ జిలానీ, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హబీబుల్లాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. దాని వల్ల నేడు మైనారిటీ వర్గాలకు చెందిన ఎందరో యువత చక్కగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. అదేవిధంగా ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు, బీజేపీ, జనసేనలు మైనారిటీల రిజర్వేషన్లు తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని అందుకే మైనారిటీలంతా ఐకమత్యంగా ఉండి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా బలసాని కిరణ్కుమార్ను, గుంటూరు ఎంపీగా కిలారి వెంకటరోశయ్యను ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైనారిటీ విభాగం నాయకులు, కార్యకర్తలు అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా పనిచేసి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం
వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా