తుని: స్థానిక జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడని ఎస్సై ఎస్కే అబ్దుల్ మారూఫ్ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తుని – నర్సీపట్నం మధ్యలో విశాఖపట్నం వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి సుమారు 25 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడి ఒంటిపై నలుపు రంగు జీన్ ప్యాంటు, సిమెంట్ రంగు చొక్కా ఉన్నాయి. మృతుడి వివరాలేమీ తెలియలేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
తల్లిదండ్రుల చెంతకు
క్షేమంగా బాలుడు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన ఓ బాలుడిని ప్రకాశం నగర్ పోలీసులు క్షేమంగా అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల ఏడో తేదీ రాత్రి కానిస్టేబుల్ సీహెచ్ శేషు నైట్ బీట్ గస్తీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్లో అయోమయంగా తిరుగుతున్న 15 ఏళ్ల బాలుడు కనిపించాడు. అనుమానంతో ఆ బాలుడిని ప్రశ్నించగా, తన పేరు దేవరకొండ సత్య విశ్వనాథ్ అని, తండ్రి వీరభద్రరావు అని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం తన స్వగ్రామమని, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. వెంటనే కానిస్టేబుల్ సీహెచ్ శేషు ఈ విషయాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.కృపానందానికి సమాచారం ఇచ్చారు. ఆ బాలుడిని ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం వారికి బాలుడిని క్షేమంగా అప్పగించారు.