మరో ఆవుకు అస్వస్థత
అమలాపురం టౌన్: ఎవరో గుళికలు కలిపిన అన్నం పాడేయంతో ఆ అన్నాన్ని తిన్న ఆవు మృతి చెందింది. మరో ఆవు అస్వస్థతకు గురైంది. పట్టణంలోని కల్వకొలను వీధిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో సంచరించే ఈ రెండు ఆవులు గుళికల కలిపిన అన్నం తిని ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానిక గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలకు చెందిన గో సేవకులు స్పందించి తక్షణమే దానికి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ చీకట్ల వెంకట నారాయణ స్వయంగా వచ్చి వైద్య సేవలు అందించారు. ఓ ఆవు మృతి చెంది, మరో ఆవు అస్వస్థతకు గురికావడంతో గో సేవకులు ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల సేవకులు కాశి రతన్రాజు, గొవ్వాల అచ్యుతరామయ్య, చాగంటి ప్రసాద్, పంజా స్వామి, పోతురాజు నరసింహరావు తదితరులు ఆవులకు వైద్య సేవలించిన వారిలో ఉన్నారు.