అందరికీ ఉన్నత విద్యే ప్రభుత్వ లక్ష్యం
● జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో మేలు
● జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర
● 34,097 మందికి రూ.26.28 కోట్ల జమ
సాక్షి, అమలాపురం: ఉన్నత విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించిన సొమ్మును బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి జేసీ ధ్యానచంద్రతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఏటా నాలుగు విడతలలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. దీనిద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర కోర్సులు చదువుతున్న 34,097 మంది విద్యార్థినీ విద్యార్థులకు సంబంధించి తల్లుల ఖాతాలకు రూ.26,28,36,222 ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేసిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యను అందించడానికి సీఎం జగన్ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకంలో ఐటీఐ నుంచి పీజీ వరకూ (ఇంటర్ తప్ప) చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, వికలాంగులైన విద్యార్థులలో అర్హులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నారని జేసీ అన్నారు. జగనన్న వసతి దీవెన పథకంలో ఐటీఐ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, అంతకంటే ఎక్కువ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు రూ.20 వేల చొప్పున అందుతుందన్నారు. నాల్గో త్రైమాసికంలో అర్హులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మొత్తం తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసిందని, ఈ మొత్తాన్ని ఏడు నుంచి పది రోజులలో కళాశాలలకు అందించాలని జేసీ ధ్యానచంద్ర తెలిపారు. హితకారిణి సమాజం అధ్యక్షులు కాశీ బాల మునికుమారి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ పి.జ్యోతిలక్ష్మీదేవి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.