వారాంతాన బలహీనపడ్డ బంగారం ధర మరోసారి డీలాపడింది. అయితే వెండి మాత్రం పుంజుకుంది. ప్రస్తుతం ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాముల ధర రూ. 37 క్షీణించి రూ. 52,190 వద్ద ప్రారంభమైంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 248 బలపడి రూ. 67,419 వద్ద ట్రేడవుతోంది. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశ, విదేశీ మార్కెట్లలో వారాంతన దిగివచ్చిన ధరలు ప్రస్తుతం అటూఇటుగా కదులుతున్నాయి.
వారాంతాన..
శుక్రవారం ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాముల ధర రూ. 703 క్షీణించి రూ. 52,227 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 52,797 వరకూ లాభపడినప్పటికీ ఒక దశలో రూ. 51,840 వరకూ డీలా పడింది. ఇక వెండి కేజీ రూ. 3,906(5.5 శాతం) పడిపోయి రూ. 67,171 వద్ద స్థిరపడింది. అయితే రూ. 70,939 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 66,202 వద్ద కనిష్టానికీ చేరింది.
కామెక్స్లో ప్రస్తుతం
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,952 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లో స్వల్ప నష్టంతో 1,942 డాలర్లకు చేరింది. ఇక వెండి ఔన్స్ 1.2 శాతం బలపడి 26.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి బలహీనపడ్డాయి. ఫ్యూచర్స్లో ఔన్స్ ధర 1 శాతం(21 డాలర్లు) క్షీణించి 1950 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్లో 0.5 శాతం నీరసించి 1945 డాలర్ల ఎగువన ముగిసింది. ఇక వెండి 6 శాతం పతనమై 26.26 డాలర్ల వద్ద స్థిరపడింది.