ఇల్లెందు: దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణ కోసం పోరాడుతుంటే వారిని క్రూరంగా హతమారుస్తూ ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆలిండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, కోకన్వీనర్ సూర్నబాక నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యాన ఫాసిజానికి వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం ఇతర అట్టడుగు వర్గాలతో కలిసి పోరాడాల్సిన తరుణం అసన్నమైందని చెప్పారు. ఇల్లెందులోని పెన్షనర్ల భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖపట్నంలో వివిధ రాష్ట్రాల ఆదివాసీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఫోరం ఏర్పడిందని తెలిపారు. పది రాష్ట్రాల్లో ఆలిండియా ట్రైబల్ ఫోరం ఆవిర్భావ సదస్సులు నిర్వహిస్తూ రాష్ట్రస్థాయి కమిటీలను నియమిస్తున్నామని, ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రస్థాయి సదస్సు జూన్ 9న కొత్తగూడెంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలను అడవి నుంచి వెళ్లగొట్టి ఖనిజ సంపదను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే కాక ఆదివాసీల రక్షణగా ఉన్న చట్టాలను ఎత్తివేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రపన్నిందని విమర్శించారు. ఈ నేపథ్యాన ఆదివాసీలను ఏకం చేసి హక్కుల సాధన, చట్టాల రక్షణకు పోరాడుతున్నట్లు సత్యం, నాగేశ్వరరావు వెల్లడించారు. సమావేశంలో నాయకులు వీసం కృష్ణ, చింతా ఉదయ్, చింత రజిత తదితరులు పాల్గొన్నారు.
ఫోరం జాతీయ కన్వీనర్ సత్యం,
కోకన్వీనర్ నాగేశ్వరరావు