ఏ నీటి వనరులో నిల్వ ఉన్న నీరైనా ఎప్పటికో ఒకసారి ఇంకిపోతుంటుంది. నెలలు కావచ్చు, ఏళ్లు కావచ్చు కానీ నీరు ఖాళీ కావడం మాత్రం ఖాయం. కానీ, పుట్లూరు మండలం చాలవేముల సమీపంలోని జాజికొండపై ఉన్న నీటి కుంటలో మాత్రం నీరు అసలు ఇంకి పోవడమే లేదు. ఎత్తైన కొండపై చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం పక్కనే ఈ కుంట ఉంది. రాతిబండపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ
కుంటలోని నీటి ద్వారా ఆలయానికి వచ్చే భక్తులతో పాటు మూగజీవాలు దప్పిక తీర్చుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈ కొండపై నీరు నిల్వ ఉంటోంది. రాతి బండ కావడం వల్లే నీరు ఏళ్ల తరబడి ఇంకిపోవడం లేదని కొందరు అంటుండగా, చౌడేశ్వరి అమ్మవారి మహిమ వల్లే ఎండిపోవడం లేదని భక్తులు చెబుతున్నారు. – పుట్లూరు: