అనంతపురం కార్పొరేషన్: మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమే అని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ అండగా నిలిచారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పోలింగ్ రోజు రాత్రి 11 గంటల వరకూ కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారన్నారు. జగనన్నకు జై కొట్టిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కృషితో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందన్నారు. జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని, లేకుంటే బీజేపీలో విలీనమవుతుందని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్న జిల్లా పోలీసులకు అభినందనలు తెలియజేశారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఛీ కొట్టినా పచ్చ మూకలకు బుద్ధి రావడం లేదన్నారు. సమావేశంలో తాడిపత్రి మార్కెట్యార్డు చైర్మన్ హరినాథ్ రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ
జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగు : పార్టీ అధ్యక్షుడు పైలా