తాగునీరు సక్రమంగా సరఫరా కావాలి
అనంతపురం అర్బన్: ‘వేసవిలో తాగునీటి సరఫరా సక్రమంగా చేపట్టేందుకు గ్రామ పంచాయతీల్లో రూ.38.28 కోట్లు నిధులు ఉన్నాయి. మండల, జిల్లా పరిషత్లోనూ నిధులు ఉన్నాయి. రానున్న మూడు నెలలు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి’ అని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఏబీఆర్ నీటిని జాగ్రత్తగా వినియోగించాలన్నారు. పైప్లైన్ లీకేజీలు, అదనపు వాల్ డీఫాల్ట్లను అరికట్టడంతో పాటు జల్ జీవన్ మిషన్ పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్య గుర్తించిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎక్కడైనా తాగునీటి అడ్డంకులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉరవకొండ ప్రాంతంలో నీటి సమస్యపై ఫిర్యాదులు వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అప్రమత్తంగా ఉంటూ
సమస్యలు పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ గౌతమి ఆదేశం