డిజిటల్ చెల్లింపులపై అవగాహన కలిగి ఉండాలి
అనంతపురం: డిజిటల్ చెల్లింపులతో కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్కేయూ రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య అన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగిసింది. కార్యక్రమానికి ఆచార్య ఎంవీ లక్ష్మయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జాతీయ సదస్సుకు హాజరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంపొందడానికి దోహదపడుతాయని పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ లావాదేవీలు మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం జాతీయ సదస్సులో పేపర్ ప్రజెంటేషన్ చేసిన వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ పి.మురళీకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు.