రాప్తాడు ఎమ్మెల్యేపై విమర్శలు తగదు
అనంతపురం కార్పొరేషన్: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అనుచితంగా మాట్లాడడం తగదని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హెచ్చరించారు. ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జోనల్ ఇన్చార్జ్ రాజారాం, మాజీ జెడ్పీటీసీ ఈశ్వరయ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాప్తాడు నియోజకవర్గ నాయకులతో కలసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోయ రాజారాం, ఈశ్వరయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే ఎన్నికల వేళ రాప్తాడు ఎమ్మెల్యే గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగేలా మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే రాజారాంకు వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారన్నారు. బడుగులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే వైఎస్సార్సీపీ లక్ష్యమన్నారు. రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, రామగిరి సర్పంచ్ మీనుగ నాగరాజు, జెడ్పీటీసీ నాగార్జున, మండల కన్వీనర్ శేఖర్, నాయకులు పసుపుల ఆదినారాయణ మాట్లాడుతూ... వైఎస్సార్సీపీలో కొనసాగుతూ ఎన్నికల వేళ పార్టీకి ద్రోహం చేసేలా బోయ రాజారాం, ఈశ్వరయ్య వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో బోయ, కురుబలకు రాజకీయ ప్రాధాన్యత దక్కిందనేందుకు తామే ప్రబల సాక్ష్యమన్నారు. రాప్తాడులో 30 ఏళ్ల పాటు సాగిన పరిటాల కుటుంబం అరాచకానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అడ్డుకట్ట వేశారన్నారు. పరిటాల కుటుంబంలో బిల్లే ఈశ్వరయ్య లోపాయికార ఒప్పందాలు చేసుకుని నీచ రాజకీయాలకు తెరలేపాడని మండిపడ్డారు. మరోసారి రాప్తాడు ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా