తాండవలో ఇసుక తవ్వితే కేసులు | Sakshi
Sakshi News home page

తాండవలో ఇసుక తవ్వితే కేసులు

Published Thu, May 23 2024 6:45 AM

తాండవలో ఇసుక తవ్వితే కేసులు

● నది ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

నాతవరం: తాండవ నదిలో ఇసుక తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈబీ ఎస్‌ఐ ఎస్‌.కె.రహీమ్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన గనుల శాఖ, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో కలిసి చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో నిర్మించిన తాగునీటి పైలెట్‌ ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల కొంతమంది అక్రమార్కులు ఇక్కడ పైలెట్‌ ప్రాజెక్టు ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లుగా సమాచారం అందింది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నది సమీపంలో రైతులను, ప్రజలను ఇసుక తవ్వకాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే మార్గంలో ఇసుక తరలించకుండా అడ్డుగా ఏర్పాటు చేసిన కర్రను పరిశీలించారు. ఇటీవల నదిలో ఇసుక తవ్వకాలు జరగలేదని ఈ సందర్భంగా ఎస్‌ఈబీ ఎస్‌ఐ తెలిపారు. ఇసుక తవ్వకాలు చేస్తే తాగునీటి పైలెట్‌ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా తాండవ నది పొడవునా ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకుండా అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. గనుల శాఖ జేఈ హరకుమార్‌నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement