ఏయూక్యాంపస్: ప్రజల మధ్య సోదరభావవం పెంపొందాలని అమెరికాకు చెందిన భాషా శాస్త్రవేత్త డాక్టర్ మైకేల్ బ్రాన్ అన్నారు. ఏయూ అంబేడ్కర్ చైర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం అమెరికన్ కార్నర్లో బ్రింగింగ్ బోర్డర్స్ ఫర్ ఈక్వాలిటీ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. పలు దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనమంతా సమానంగానే జన్మించామనే వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు. జీవించే హక్కు, సంతోషాన్ని పొందే హక్కును కలిగి ఉండాలన్నారు. ఏయూ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.సమత మాట్లాడుతూ అంబేడ్కర్ దార్శనికతను ప్రపంచవ్యాప్తంగా యువతకు పరిచయం చేసే విధంగా ఈ కార్యక్రమం సాగిందన్నారు. ఏయూ పాలక మండలి పూర్వ సభ్యుడు డాక్టర్ పి.ఏసుపాదం మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలను తీర్చే దిశగా యువత ఆలోచన చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.జేమ్స్ స్టీఫెన్ మాట్లాడుతూ అసమానతలను రూపుమాపే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ఆలోచనలను యువతకు వివరించారు. ఆఫ్గనిస్తాన్ విద్యార్థి అబీదుల్లా మాట్లాడుతూ భారతదేశ విజయ రహస్యం రాజ్యాంగమేనన్నారు. అనంతరం అతిథులను వర్సిటీ తరఫున సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా సూడాన్, ఘనా, బంగ్లాదేశ్, పాలస్తీనా, ఇథియోపియా, ఉగాండా తదితర దేశాలకు చెందిన విద్యార్థులు తమ ఆలోచనలు, తమ దేశంలో ఉన్న పరిస్థితులను వివరించారు.
అమెరికా భాషా శాస్త్రవేత్త మైకేల్ బ్రాన్