దేవరాపల్లి: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నిలిచారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మామిడిపల్లిలో స్థానిక సర్పంచ్ కర్రి సూరినాయుడు, జెడ్పీటీసీ కర్రి సత్యం ఆధ్వర్యంలో సుమారు రూ.1.25 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఆదివారం పండగ వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎంపీ బి.వి. సత్యవతి, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ కొండా రమాదేవి, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈర్లె అనురాధ తదితరులకు కోలాటం, తీన్మార్ వాయిద్యాల నడుమ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మరిడిమాంబ, నూకాంబిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. రూ.60 లక్షలతో నిర్మించిన ఇంటింటికీ కుళాయిలు, మంచినీటి ట్యాంక్ను, రూ.43.60 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ప్రారంభించారు. రూ.20.80 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ను ఎంపీ సత్యవతి, పౌర గ్రంథాలయ శాఖ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సర్ కొండా రమాదేవి ప్రారంభించారు. మామిడిపల్లి సచివాలయ పరిధిలోని మామిడిపల్లి, తిమిరాం పంచాయతీలలో సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో పాలనలో రూ.12.83 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేపట్టిన వివరాలతో కూడిన శిలాఫలకాన్ని డిప్యూటీ సీఎం, ఎంపీ ప్రారంభించారు. అనంతరం మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి,డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, గౌతమ బుద్ధుడు విగ్రహాలను డిప్యూటీ సీఎం ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి మాట్లాడుతూ మహనీయుల స్పూర్తితో సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో గ్రామ స్థాయిలోనే ప్రజలకు అన్ని సేవలను అంది స్తున్నారన్నారు. అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతందన్నారు. ఈకార్యక్రమంలో ని యోజకవర్గ పరిశీలకుడు ఉరుకుటి అప్పారావు, కొండా రాజీవ్ గాంఽధీ, స్థానిక జెడ్పీటీసీ కర్రి సత్యం, దేవరాపల్లి, కె.కోటపాడు ఎంపీపీలు కిలపర్తి రాజేశ్వరి, రెడ్డి జగన్మోహన్, మాడుగుల జెడ్పీటీసీ కిముడు రమణమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు కిలపర్తి భాస్కరరావు, దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, తాళ్లపురెడ్డి రాజారామ్, గొల్లవిల్లి రాజుబాబు, కురచా నారాయణమూర్తి, లాలం జానకీరామ్, వైస్ ఎంపీపీలు చింతల బుల్లి లక్ష్మీ, ఉర్రూకుల గంగాభవానీ, రొంగలి నారాయణమ్మ, స్థానిక సర్పంచ్ కర్రి సూరినాయుడు, ఎంపీటీసీ పంచాడ సింహాచలం నాయుడు, తిమిరాం సర్పంచ్ రెడ్డి సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
మామిడిపల్లిలో పండగలా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
వైఎస్ రాజశేఖరెడ్డి, అంబేడ్కర్, బుద్ఢుడి విగ్రహాల ఆవిష్కరణ