ఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా 280 మంది విత్తన డీలర్ల వద్ద 6,32,446 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా సమీపంలోని దుకాణాలను సంప్రదించి విత్తనాలు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. డీలర్లు ఎవరైనా ఎంఆర్పీకి మించి విక్రయించినా, విత్తనాలు అందుబాటులో ఉండి కూడా లేవని చెప్పినా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
‘ఆర్డర్ కాపీలు సరే.. పోస్టింగ్లు ఎప్పుడు?’
నేరడిగొండ: గురుకుల పాఠశాలలు, కళా శాలల్లో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదని గిరిజన లంబాడాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురుకులాల్లో ఎంపికైన అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఆర్డర్ కాపీలు ఇచ్చినా ఇంకా పోస్టింగ్ కల్పించ డం లేదని పేర్కొన్నారు. అలాగే స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ వారికి సైతం నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.