దస్తురాబాద్: మండల కేంద్రంలో రేబిస్ కలకలం రేపుతోంది. మండల కేంద్రంలో ఇప్పటికే ఐదు బర్రెలు మృతి చెందాయి. మరోవైపు మరిన్ని బర్రెలకు వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పశువైద్యులు స్పందించి మండల కేంద్రంలో రేబిస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని పశు యజమానులు కోరుతున్నారు.
బైకును ఢీకొన్న కారు
నర్సాపూర్ (జీ): మండలంలోని అర్లి (కే) హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదుట భైంసా నుంచి నర్సాపూర్ (జీ)కి వస్తున్న బైకును నిర్మల్ నుంచి భైంసా వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న రాహుల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బెల్లంపల్లి: బెల్లంపల్లి పాత బస్టాండ్ ఏరియాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పాత బస్టాండ్ ఏరియాలోని బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఉన్న తోపుడు బండిపై బుధవారం మధ్యాహ్నం 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి 8 గంటలకు కొందరు వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. వడదెబ్బ తగిలి చనిపోయాడా, మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపర్చారు.