కావలి(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): రైలు ఢీకొని తల్లీకొడుకు మృతిచెందిన ఘటన కావలి రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం చాగణంకు చెందిన ఐసీడీఎస్ ఉద్యోగిని బట్టా సుభాషిణికి (55)కి కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో ఆమె తన కుమారుడు విజయ్ (28)ను తోడు తీసుకుని గూడూరు నుంచి కావలి రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎగువమార్గం పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో దురంతో ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. చివరి క్షణంలో రైలు గమనించిన విజయ్ తల్లిని కాపాడేందుకు ముందుకు రావడంతో ఇద్దరూ ప్రమాదం బారిన పడ్డారు. దురంతో ఎక్స్ప్రెస్ రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎన్నికల విధులకు హాజరైన పలువురు ఉద్యోగులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు అనాలోచితంగా దూర ప్రాంతానికి చెందిన మహిళకు విధులు కేటాయించారని మండిపడ్డారు. రైల్వే పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.
రైలు ఢీకొని తల్లీకొడుకు దుర్మరణం
కావలిలో ఘటన