● సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం ● పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామగ్రి, సిబ్బంది ● రీ పోలింగ్కు చాన్స్ లేకుండా ఏర్పాట్లు ● సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యే నిఘా
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదివారం విధులకు కేటాయించిన ఉద్యోగులకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసింది. ఆ మేరకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఆరుగురు చొప్పున జిల్లాలో 2,140 పోలింగ్ కేంద్రాలకు పంపింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది.
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బంది సందడి
జిల్లా సమాచారం...
ఓటర్లు 18,12,980
సర్వీస్ ఓటర్లు 862 మంది
ఎన్నారై ఓటర్లు 291 మంది
పీడబ్ల్యూడీ ఓటర్లు 24,596
85 ఏళ్లు దాటిన ఓటర్లు 7924
పోలింగ్ స్టేషన్లు 2,140
మోడల్ పోలింగ్ స్టేషన్లు 14
సమస్యలు లేని పోలింగ్ స్టేషన్లు 1,444
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 696
వల్నరబుల్పోలింగ్ స్టేషన్లు 15
హోమ్ ఓటింగ్తోపాటు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 22,416
తిరుపతి అర్బన్: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని ఎన్నికల కసరత్తును జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. జిల్లాలో సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై ఎన్నికల సంఘం, పోలీస్ అధికారులు డేగకన్ను పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పక్క రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కేంద్రబలగాలు ఈ ఎన్నికల్లో పహారా కాస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 696 సమస్యాత్మక, 15 అతిసమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, ఆయా కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
ఓటింగ్ శాతం పెంచేందుకు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 2019లో 78.06 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 18,12,980 మంది ఓటర్లలో సాధ్యమైనంత మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 24,596 మంది దివ్యాంగ ఓటర్లుండగా వారందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.
ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్
సార్వత్రిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఐదు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం ఈ ఎన్నికల్లో 14,342 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. వారంతా ఆదివారం రాత్రి పోలింగ్ కేంద్రాలలోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు సోమవారం ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్లోని మెమరీని డిలీట్ చేసి, వీవీప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు.
ఇరకం దీవికి బోటులో తరలివచ్చిన సిబ్బంది
తడ: మండలంలోని ఇరకం, వేనాడు ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు.
ఓటు హక్కు అందరి బాధ్యత
ఓటు హక్కు ప్రజలందరి బాధ్యతగా భావించాలి. ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఐదు నెలలుగా జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమంచి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాం. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. – ప్రవీణ్కుమార్,
జిల్లా ఎన్నికల అధికారి, తిరుపతి
ఈవీఎంలను తీసుకెళ్తున్న సిబ్బంది