● ఎస్పీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి ఆదివారం ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్కు లేఖలో ఫిర్యాదు చేశారు. ఇతర జిల్లాల్లోని నేరచరిత్ర కలిగిన వ్యక్తులను సమీకరించి నారాయణ విద్యాసంస్థలు, నెల్లూరు నగరంలోని పలు లాడ్జిల్లో ఉంచి నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు వేయించడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు సృష్టించడం, వైఎస్సార్సీపీ ఓటర్లను భయపెట్టడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. విద్యాసంస్థలు, లాడ్జిల్లో ఉంచిన సంఘ విద్రోహక శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 171(బీ)కి కూడా విరుద్ధమన్నారు. అన్నీ నియోజకవర్గాల్లో డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్టవేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఈసీ మార్గదర్శకాల ప్రకారం అన్నీ పార్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.