-
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.క్రమం తప్పని వ్యాయామంఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్ను అస్సలు పట్టించుకోరు.ఆహారం పట్ల నిర్లక్ష్యంఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.కింగ్ లాంటి లంచ్కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి. స్నాక్స్రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.చివరిగాఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! -
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
అభివృద్ధిపథంలో అల్లూరి జిల్లా సీఎం జగన్ మార్క్..!
-
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
దారి తప్పిన బాటసారి.. ప్రతి అడుగు అపాయం వైపే...!
-
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
RashmikaMandanna : అద్దె కట్టడానికి డబ్బుల్లేవు..మరెలా వచ్చిందీ స్టార్డమ్
సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. స్టార్ హీరో, మెగాహీరో, సూపర్ స్టార్, క్రేజీ స్టార్, గ్లోబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ఈ ట్యాగ్లు, బిరుదులు అన్నీ హీరోలకే. వీటిన్నింటిని తోసి రాజని తామేంటో నిరూపించుని నిలబడిన వారు చాలాకొద్దిమంది. అలాంటి వారిలో టాప్లో ఉంటుంది నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న నటి రష్మికమందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ‘తగ్గేదేలే’ అంటూ దూసుకు పోతోంది. ఒక కుగ్రామంనుంచి వచ్చి ఇంత స్టార్డమ్ ఎలా తెచ్చుకుంది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. 1996 ఏప్రిల్ 5న పుట్టింది రష్మిక. ఆంగ్ల సాహిత్యం, జర్నలిజం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీలు చేసింది. రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసింది.అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని కూడా చూసింది. కర్ణాటకలో పుట్టిపెరడంతో 2016లో కన్నడ మూవీతో "కిరిక్ పార్టీ" , తెరంగేట్రం చేసింది. తొలి సినిమాలనే సూపర్హిట్ అయింది. 20 ఏళ్లకే నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బిజినెస్ చేసింది. అందం, అభినయానికి , పట్టుదల, కృషిని జోడించింది. అలా టాలీవుడ్కి పరిశ్రమను ఆకర్షించింది. 2018 లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కిల్లర్ లుక్స్తో ఇటు యూత్ ఐకాన్గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్గా మారింది. సమంతా సినిమా తిరస్కరించడంతో. రష్మిక మందన్నకు అదృష్టం వరించింది. ఇక ఆ తరువాత "డియర్ కామ్రేడ్", గీత గోవిందం" వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. వరుస సినిమాలతో ఈమె మన తెలుగు అమ్మాయే అన్నట్టుగా మారిపోయింది. అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఆ తరువాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' సినిమా ఆమెకు ఎక్కడలేని స్టార్డమ్ తెచ్చి పెట్టింది. చిత్తూరు యాసతో శ్రీవల్లిగా అందరినీ అబ్బుర పరిచింది. శ్రీవల్లి కాస్తా 'నేషనల్ క్రష్' గా అవతరించింది. ఇక ‘సామి.. సామి’ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పుష్ప రికార్డు వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ కూడా రారమ్మని ఆహ్వనించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి "మిషన్ మజ్ను"లో రష్మిక మందన్న బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అటు తమిళంలో కార్తీతో కలిసి "సుల్తాన్" లో కోస్టార్గా నటించింది. తరువాత విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ మూవీ 'యానిమల్' మూవీ రష్మిక మందన్న కెరీర్ని కొత్త మలుపు తిప్పింది. తమిళంలో విజయ్తో చేసిన 'వారిసు' మూవీ కూడా సూపర్హిట్ అయింది. దీంతో ఇంటర్ నేషనల్ క్రష్గా మారిపోయింది. అంతేనా ఇటీవల వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా త '30 అండర్ 30' అనే కేటగిరీలో చోటు సంపాదించుకుంది. సినిమా పరిశ్రమనుంచి అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా నిలిచింది. అవార్డులు "కిరిక్ పార్టీ"లో తన నటనకు ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (SIIMA) గెలుచుకుంది. “గీత గోవిందం” మూవీకి ఉత్తమ నటిగా జీ సినీ అవార్డ్స్ తెలుగు , తెలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వీటన్నింటికన్న మిన్నగా తన యాక్టింగ్ స్టయిల్, స్మైల్, ఆన్-స్క్రీన్ లుక్స్, మెస్మరైజింగ్ లుక్స్తో పాన్-ఇండియా స్టార్గా లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, డేటింగ్ రూమర్లు, పెళ్లికబుర్లు, ట్రోలింగ్లు, డీప్ ఫేక్ వీడియోలు ఇవేవీ రష్మిక కమిట్మెంట్ను దెబ్బతీయలేవు.. ఒక్క చిరునవ్వుతో అవన్నీ బలా దూర్ అంటారు ఫ్యాన్స్. -
ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే!
తొలి తరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్లో న్యూస్ రీడర్గా బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుపరిచితం. ఎంతోమంది న్యూస్ రీడర్లకు, వ్యాఖ్యాతలకు ప్రేరణగా నిలిచారు. తన గాత్రంతో ఎన్నో వార్తలను, సంచలనాన్ని, విజయాల్ని, విషాదాలను ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది. ఆయన భౌతికంగా మూగబోయినా.. ఆ స్వరం మాత్రం ఆ చంద్ర తారార్కం...! 2014లో శాంతి స్వరూప్ గారితో సాక్షి, ఫ్యామిలీ ప్రతినిధి డా. పురాణపండ వైజయంతి సంభాషణ పాఠకుల కోసం.. టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా! తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే... అందరికీ గుర్తుకు వచ్చేది శాంతిస్వరూప్. పేరుకు తగ్గట్టుగా... మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..! వార్తలు... సమాచారం... ‘జాబులు - జవాబులు’... ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం... ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు.. తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ని నేనే. మొదటి బులెటిన్... 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్గా నన్నే నియోగించారు. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చే శాం. ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదుల్తూనే ఉన్నాయి. మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవాడిని. నా కొలీగ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి తెలుగు వార్తలు పూర్తయిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి. అక్కడ వాళ్లకి టెలీ ప్రాంప్టర్లు ఉన్నాయి. వాళ్లు పేపరు చూడకుండా చదువుతారు. వారికి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం చిన్న పిల్లవాడిలాఅంతా వల్లె వేసి, జ్ఞాపకం ఉంచుకునేవాడిని. ప్రతిరోజూ నా జ్ఞాపకశక్తికి అది ఒక పరీక్ష. సందర్భోచితంగా... వార్తలలోని మూడ్ ప్రేక్షకులకు అందాలనేది నా ఉద్దేశం. భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తలా ముఖ కవళికలు ఉంచి చదవలేను. అలాగని గట్టిగా అరవనూ లేను. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటివారికి చెబుతున్నట్లుగానో చదివేవాడిని. మధురజ్ఞాపకాలు... కేంద్ర ప్రభుత్వం నుంచి ‘షా కమిషన్’ కి సంబంధించిన పది పేజీల రిపోర్టు ఇంగ్లీషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్కి వచ్చేది. దానిని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే నేను ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని. ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను. ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది. మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు. మరో సంఘటన... పదహారు సంవత్సరాల అమ్మాయి తన వదినగారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కిందట. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి, ‘శాంతి స్వరూప్ మా మేనమామ. ఆయన్ని చూడటానికి వెళుతున్నాను’ అని చెప్పిందట. ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. పోలీసు లు విచారణ చేసి, ఆ అమ్మాయి అన్నగారిని పిలిపించి, ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ‘‘నా పెళ్లికి మీరు తప్పక రావాలి’’ అని నా దగ్గర మాట తీసుకుంది. అలా తెలుగువారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే. దాన్నిబట్టి దూరదర్శన్ ఎంత శక్తిమంతమైన మాధ్యమమో అర్థం అవుతుంది. ప్రభావం... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. వీటివల్ల నేటి యాంకర్లు కష్టపడవలసి వస్తోంది. అయితే ఔట్పుట్ మాత్రం సంతృప్తిగా ఉండట్లేదు. సర్కస్లో జోకర్లా వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలు కలిపి చదువుతున్నారు. ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల వినసొంపుగా ఉండట్లేదు. తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్ని, న్యూస్ రీడర్ని కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడు నన్ను మర్చిపోలేరు. జనవరి 7, 2011 జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. నేను పదవీ విరమణ చేసినప్పటికీ తెలుగు ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం, గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రేమిస్తున్న వారందరికీ ఋణపడి ఉంటాను. నా ఉద్దేశంలో టీవీ అంటే... ఇదొక శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకువచ్చింది. అయితే... దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వైద్యం, విద్య, సంస్కృతి సంప్రదాయం, మానవ సంబంధాలకు టీవీ దూరమైపోతోంది. అదే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం-గుర్రాలు మాట వినవు!
ధర్మాచరణకు ప్రధానమైన ప్రతికూల పరిస్థితులు రెండు–అర్థము, కామము. ఇవి ధర్మాచరణకు నిరంతరం పరీక్ష పెడుతుంటాయి. అర్థము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, భోగ సంబంధమైన సమస్త వస్తువుల రాశిని అర్థము అనవచ్చు. తనకు సుఖాన్నిచ్చే మంచం, కుర్చీ, ప్రయాణించే వాహనం ఏదయినా కావచ్చు. కామము అంటే – కోర్కె వేరు, అవసరం వేరు. రెండింటికీ మధ్య సున్నితమైన భేదం ఉంది. అవసరం తీరకపోతే పాపం అడ్డు వస్తున్నదని గుర్తు. దానిని తీసేయగలిగిన శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. పాపం పోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తారు. సంతానం కోసం అశ్వమేథం.. వంటివి. మనం ఒక కోరిక కోరుకుంటున్నాం. అది అవసరం కూడా. దానికి భగవంతుడిని ఆశ్రయించడం తప్పు కానేకాదు. భగవంతుడు ఏమంటాడంటే... నాలుగు రకాల భక్తులు నన్ను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు. చాలా ఆర్తి కలిగినవాళ్ళు, అసలు భగవంతుడెవరని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. మంచి పనులు చేయడానికి ధనసహాయం కోరుకుంటున్న వాళ్ళు. తత్త్వతః పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకుని స్తోత్రం చేసేవాళ్ళు. చివరి తరగతి భక్తులగురించి శంకరాచార్యులవారు ఏమంటారంటే... సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో తత్త్వాన్ని అవగతం చేసుకుని జ్ఞాని భగవంతుడిని స్తోత్రం చేయడం అలా ఉంటుంది–అని. ఎక్కడో కోటానుకోట్లలో ఒక్కరే కారణజన్ములుంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వారికి అర్థకామముల మీద ఎటువంటి తపనా ఉండదు. ఒకవేళ ఏదయినా మనసులో ఏర్పడినా, ధర్మాన్ని రక్షించడానికి ఇలా చేద్దామన్న ఆలోచనే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. దేనినీ కోరుకోడు. అతడు జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా !!! ఉండరు. ధర్మానికి పెద్ద పరీక్ష అర్థము. ఒక కోరిక తీర్చుకోవడానికి పరుగులు తీయడం.. చివరకు తీర్చుకుంటాడు. అది తీరి΄ోయింది కనుక మళ్లీ ఆ కోరిక పుట్టదు– అని చెప్పలేం. మామిడిపండు తినాలని ఆరాటపడి, చివరకు అది దొరికి తిన్న తరువాత.. అది అక్కడితో ఆగదు. అదే పండు మళ్ళీ మళ్లీ కావాలనిపించవచ్చు, ఏ పండయినా సరే అని మళ్ళీ పరుగులు మొదలు కావచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నేతి ΄ాత్ర పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ప్రజ్వరిల్లే అగ్ని మీద నెయ్యి చల్లితే, అది ఆరదు, మరింత విజృంభిస్తుంది. కోరికలూ అంతే. అవి ఉపశమించే అవకాశం ఉండదు. మరి అర్థకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. అవి ఉండితీరతాయి. ఎవరికయినా భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి అవసరమయిన సాధనసంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరికా ఉంటుంది. దానికి సనాతన ధర్మం ఒక చక్కటి పరిష్కారం చూపింది. అర్థకామములను ధర్మంతో ముడిపెట్టింది. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అర్థము.. ఇవి మోక్షానికి కారణమవుతాయి తప్ప బంధాలకు, కోరికలు అపరిమితంగా ప్రజ్వరిల్లడానికి కారణం కావు. అప్పుడు మనిషి జీవితం, కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. చెలియలికట్ట దాటే సాహసం చేయవు. -
ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'
'వారంలోని ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకతా లేని గురువారం. చలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ప్రభావం చూపుతోంది. బూడిదరంగు ఆకాశంలో కృశించిపోయిన సూర్యుడు సన్నని వెలుతురు పంచుతున్నాడు. మునుపెన్నడో చెత్తకుండీలోంచి ఏరుకొచ్చిన ఓ నడిపాత తివాచీపై కూతురు దగ్గుతో లుంగలు చుట్టుకుపోవడాన్ని మజీద్ నిస్సహాయంగా గమనించసాగాడు. పనార్ ఎడారిలోని సంచారతెగలు వుండే ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి అదే కాస్త వెచ్చదనాన్ని సమకూరుస్తోంది. బైట న్యుమోనియా ప్రబలిపోతుండడంతో మజీద్ తన కూతుర్ని ఎన్నో ఆస్పత్రులకు తిప్పితే చివరికి ఓ డాక్టర్ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. ఆయన మందులిచ్చి వ్యాధి మరింత ఎక్కువ కాకుండా పిల్లని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచమన్నాడు.' ‘ఇలా రండి, కాస్త టీ, రొట్టీ, ఓ గుడ్డు తీసుకుందురు గానీ’ భార్య ఫరీదా అంది. తన కొడుకులు బైట సంతోషంగా ఆడుకోవడాన్ని, ఫరీదా అతని చుట్టూ ఆందోళనగా తిరగడాన్ని అతను నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొరటుగా మారిన చేతివేళ్లు, కాయలు గాచిన అరచేతులు.. పెళ్ళైన కొత్తల్లోని ఫరీదాకీ, ఈమెకు ఎంతో తేడా చూపుతున్నాయి. ఆగది మధ్యకు ఆమె మూలనున్న ఓ బల్లని జరిపింది. అదే వాళ్ళకి వంటగదీ, పడకగదీ, భోజనాలగదీ, అన్నీ. స్నానాల గది, పాయిఖానా ఇంటి బైటెక్కడో, అవి మాత్రం సామూహికం. వాటిని ఎన్నో కుటుంబాలవాళ్ళు వాడుకుంటుంటారు. ఇంట్లో కూడా ఈ బల్లతో పాటే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు.. అంతే! ఓ టీవీ, దాన్ని ఎక్కడో దొరికిన ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అదో మూలన చిన్న స్టూల్ మీద ఉంటుంది. నీళ్ళ కోసం వాడి పారేసిన కోకాకోలా బాటిల్స్ వాడుకుంటుంటారు. ప్రతిరోజూ వాళ్ళు మాంసం వండుకుని తినడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చిన్న ముక్క కూడా మిగలదు. అందుకని వాళ్ళకి ఫ్రిజ్ అవసరం కూడా ఉండదు. తన భార్య కూతురి ఆరోగ్యం గురించిన చింతతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని మజీద్కి బాగా తెలుసు. ఓవారం రోజుల్లోనే ఆమె మొహం ఎంత నీరసించిపోయి పీక్కుపోయిందో అర్థమవుతోంది. అయితే తను ఏరోజూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసింది లేదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడే, కానీ లోపల్లోపల అతనేదో అపరాధిలా బాధపడుతుంటాడు. తమ కష్టాలు తీరిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ‘జమీలా! నాన్నగారు బైటికి వెళుతున్నారు, టాటా చెబుదాం రా!’ అంటూ ఆ చిన్నబిడ్డని ఫరీదా తివాచీ పైనుంచి లేపేటప్పటికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. దాంతో కలవరపడిపోయిన ఆ తల్లి పాపని ఊరుకోబెట్టడానికి చిన్నగా పాడసాగింది. ‘ఈవేళ తొందరగా వచ్చేస్తానులే’ టీ ముగించిన మజీద్ అన్నాడు ఆమెతో. ‘ఇన్షా– అల్లాహ్!’ మజీద్ నెమ్మదిగా నడుస్తూ హైవే మీదకొచ్చి సిటీ బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ ఎడారే, అక్కడక్కడా ముళ్ళజెముడు మొక్కలు రోడ్డుకిరువైపులా పెరిగిపోయున్నాయి. వీస్తున్న చల్లగాలికి అతను వేసుకున్న జుబ్బా ఊగుతుంటే, తలపై టోపీ చలి నుండి, దుమ్ము నుండి అతనికి రక్షణ కల్పిస్తోంది. చలికి పగిలిన అతని పాదాలు తక్కువ ధరలో కొన్న పాత ఉన్ని మేజోళ్ళలోనూ, నకిలీ తోలుబూట్లలోనూ తలదాచుకున్నాయి. నిజం చెప్పాలంటే సంచార జాతుల వాళ్ళకు కుటుంబం గడవాలంటే చెప్పినంత సులువు కాదు. తను ఏదో ఒక పని చేస్తున్న కారణంగా అధికారులు తనని అరెస్టు చేయకుంటే చాలని ప్రతిరోజూ అతను ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో అడుక్కు తినడాన్ని నిషేధించారు కాబట్టి తమలాంటి వాళ్ళు ఏ పని దొరికితే అది చాలావరకు అవి చట్టవ్యతిరేకమైనవే అయుంటాయి. చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంచార జాతివాడిగా ముద్రవేయబడ్డ అజీజ్ కానీ, అతని తండ్రి, తాత, ఎవరూ కూడా బడికి వెళ్ళి చదువుకున్నదేలేదు. నేటి సమాజంలో చదువు రాకపోవడమంటే ఎంత దుర్భరమో అతనికి బాగా తెలుసు. ఏదో అజీజ్ తన మీద దయతో తన పనిముట్లను అతని షాపులో ఉంచుకోనిస్తూ తనకి సహకరిస్తున్నాడు. ‘జమీలా ఎలా ఉంది?’ అడిగాడు అజీజ్. ‘ఇప్పుడు ఫర్వాలేదు’ చెప్పాడు మజీద్. ‘రెండు రోజుల పాటు నువ్వు రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉండిందిలే.’ ఆ ఊళ్ళో అజీజ్ ఒక్కడే తనతో ఈ మాత్రం దయతో ఉంటాడు. అతనికో చిన్న ఎలక్ట్రిక్ షాపు ఉంది. అందులోనే అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా మజీద్ పనిముట్లను ఉంచుకోవడానికి పెద్ద మనసుతో అనుమతినిచ్చాడు. ఎప్పుడైనా ఓ మంచిరోజున అజీజ్ అతనికి ఐదారు దీనారాలను ఇస్తుంటాడు. కానీ ఆ మంచిరోజులనేవి చాలా చాలా అరుదు. ప్రతిరోజూ మజీద్ కేవలం రొట్టె, పెరుగులతో భోజనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అజీజ్ తను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం పెట్టేవాడు. కోడిమాంసం, కట్లెట్.. ఇలా. ఎప్పుడైనా ఒక్కోసారి మహబూబ్ హోటల్ నుంచి భోజనం తెప్పించేవాడు. అజీజ్ కబాబ్ కానీ మరోటి కానీ మజీద్కి తినమని ఇచ్చినప్పుడల్లా ఏదో అపరాధభావన మజీద్ని తొలిచేసేది..అనవసరంగా అతనికి భారమౌతున్నానని. ‘తిను మజీద్, నువ్వు తినకుంటే నాకు బావుండదు’ మెల్లిగా నచ్చజెప్పేవాడు అజీజ్. ‘షుక్రియా’ ఔదార్యంతో అతనిస్తుంటే, అతన్ని నొప్పించకూడదని మజీద్ తీసుకునేవాడు. అజీజ్ మంచితనానికి తను ఏ విధంగానూ, ఎన్నటికీ ఋణం తీర్చుకోలేనని మజీద్కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగి తన దశ తిరిగిపోతే తను కూడా అజీజ్లాగే ఇతరులకి సహాయపడాలని అతనెప్పుడూ కోరుకుంటుంటాడు. ప్రతిరోజూ మక్కా వైపుకు తిరిగి ఐదుసార్లు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి అద్భుతమొకటి తన జీవితంలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తుంటాడు. ఇప్పుడతని వయసు నలభై ఐదు.. తనపై ఆధారపడ్డ వాళ్ళు మరో నలుగురు. ఓ విధంగా అతను తన తల్లిదండ్రులు ఈ ‘ఆపరేషన్ లెనిన్ బోల్ట్’ ఆరంభమై ఈ కష్టాలన్నీ అనుభవించకుండా దాటుకెళ్ళిపోవడాన్ని అదృష్టంగా భావిస్తుంటాడు. అప్పట్లో అతని వయసు ఇరవై మూడు. మనిషిగా తననెప్పటికీ గుర్తించలేని ఈ మాతృభూమి పట్ల దేశభక్తి అతని కణాల్లో అగ్నిని రగిల్చేది. సైన్యంలో చాలా చిన్న ఉద్యోగంలో చేరి యుద్ధం చేసే బీభత్సాన్ని ఓ సాక్షిలా తన కళ్ళారా చూశాడు. ‘యుద్ధంలో వీరమరణమన్నదే లేదు.. రక్తపాతం తప్ప! వీధుల్లో యుద్ధట్యాంకులు నడుస్తుంటే మనసులో ఆనందం ఎలా ఉంటుంది.. ఏదో ఖాళీ అయిన భావన తప్ప! యుద్ధంలో విజయం అంటే ఈ మనసు ఖాళీ అయిందానికా లేక ఈ భయంకరమైన పరిస్థితులకా? దేన్ని విజయం అంటారు? అంతా కల్పితం, అంతా మాయ కాకపోతే!’ మసాలా టీ తాగుతూ ఎన్నోసార్లు మజీద్ యుద్ధమంటే తన ఏవగింపును కవితాత్మకంగా తన మిత్రునితో పంచుకునేవాడు. ఈ యుధ్ధంలోనే అజీజ్ తన సర్వస్వాన్ని, తన కుటుంబంతో సహా కోల్పోయాడు. నెలల తరబడి అతను తనలాంటి వాళ్ళతో కలిసి ఎంతో బెంగగా, తన దగ్గరికి రాని చావు కోసం ఎదురు చూస్తూ టెంట్లలో నివసించాడు. ఒక్కొక్కరుగా తన తోటివారి మరణాలు అతన్ని నెమ్మదిగా ఇహలోకంలోకి తెచ్చాయి. ‘పోయిందేదో పోయింది, ఇకనైనా నేను ఇతరులకి ఉపయోగపడేలా జీవించాలి’ తన్ను తానే సమాధానపర్చుకున్నాడు. అది మొదలు ఎవరికి ఏ సహాయం కావాలన్నా, శవాలు పూడ్చడంతో సహా చేయందించేవాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన సంచార జీవులు, వారికి సంబంధం లేని ఈ దేశం పట్లా, ఆ దేశపౌరుల పట్లా వారికున్న భక్తిభావం, అంకితభావం.. అన్నీ అతనికి ఎంతో విస్మయం కలిగించాయి. అప్పటి నుండి ఈ సంచారజాతుల పట్ల అతని దృక్పథం ఎంతో మారిపోయింది. అటువంటి వారికి తన హృదయంలో భగవంతుని తర్వాత అంతటి స్థానం కల్పించాడు. ఉద్రిక్తతలకు నెలవైన సరిహద్దుల నుంచి యుద్ధట్యాంకులు వెనక్కి వెళ్ళాక, వీళ్ళు కూడా తమ తమ ఆవాసాలకి.. గుర్తింపు లేని, అణచివేయబడ్డ తమ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోవడాన్ని గమనించాడతను. తమ దేశానికి కొత్తగా వచ్చిన స్వాతంత్య్రానికి ప్రతీకగా ఎగిరే జెండాను ఎక్కడ చూసినా సరే అతన్ని ఏదో అపరాధభావనతో చీల్చేసేది. ఈ విజయానికి ఇతర మిత్రదేశాలు సంబరాలు చేసుకుంటుంటే త్యాగాలు చేసిన ఈ సంచార జీవులు మాత్రం అజ్ఞాతంగా ఉండిపోయారు. ‘ఈ కపటనాటకాలతో నా మనసు అవమానంతో దహించుకుపోతోంది, నిస్సహాయుడినైపోయాను!’ అజీజ్ అన్నాడు. ‘ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు!’ విచారిస్తున్న అజీజ్ని ఓదార్చాడు మజీద్. ‘అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్!’ ‘స్వర్గమా!’ బుస కొట్టాడు అజీజ్. ‘నిజమే! ఒక్కడివే భారీ మార్పులు తేలేకపోవచ్చు, కానీ నువ్వు నాపై చూపే మంచితనం నా జీవితానికెంత ముఖ్యమో తెలుసా! నువ్వు ఆ అల్లా దూతవని నేనెప్పుడూ నమ్ముతాను.’ ‘అబ్బా, మజీద్! పొగడ్డానికైనా ఓ హద్దుండాలయ్యా!’ ‘ఇదేం పొగడ్త కాదు, నిజమే కదా?’ అజీజ్ తన ఖాళీ కప్పుని పక్కన పెట్టి, తలపైని టోపీ తీసేసి కౌంటర్ వెనక్కెళ్ళి కూచున్నాడు. ‘అస్సలామలేకుమ్!’ నీలిరంగు కోట్లు ధరించి, వయసులో ఉన్న ఇద్దరు ఈజిప్షియన్లు అక్కడికొచ్చి వైరింగ్ కేబుల్స్ కోసం అడిగారు. అజీజ్ వాళ్ళడిగిన వస్తువుల కోసం అరల వెనక్కి వెళ్ళగానే ఈజిప్షియన్లలో ఒకడు అటూఇటూ చూసి మజీద్ దగ్గరికెళ్లి తన కుడికాలి బూటుని అతనికిచ్చాడు. ‘దీన్ని కుట్టాల్సుంటుంది.. కొంత సమయం కావాలి’ పళ్ళూడి బోసినోరులా కనిపిస్తున్న ఆ బూటుని పరీక్షించి అన్నాడు మజీద్. ‘పర్లేదులే’ మజీద్ తన పనిలో తానుంటే అతను అక్కడున్న ప్లాస్టిక్ స్టూలుపై కూచున్నాడు. మరొకడు అజీజ్ తెచ్చిన వైరు సామానుని పరిశీలిస్తున్నాడు. ఐదారు నిమిషాల్లో మజీద్ తన పని ముగించేశాడు. ఆ యువకుడు బూటుని పరీక్షించి, కాలికి తొడుక్కుని, సంతృప్తిగా మజీద్ వైపు చూశాడు. ‘ఎంతివ్వాలి?’ ‘ఎంత బాబూ, యాభై షిల్స్ అంతే!’ ‘అంతే! చెత్తగాళ్ళు, ఈ దేశదిమ్మరులు కూడా ఎంత ఖరీదు చెబుతున్నారో!’ ప్యాంట్ జేబులని వెతుకుతూ అన్నాడతను. మజీద్ అతనివంక ఏ భావమూ లేకుండా సూటిగా చూశాడు. ఈ చుట్టుపట్ల చెప్పులు కుట్టే వాళ్ళలో తనే చాలా చౌక అని అతనికి బాగా తెలుసు. ‘కుక్కా! తీసుకో!’ నాణాన్ని అతనివైపుకి విసురుతూ, గారపట్టిన పళ్ళని బైటపెడుతూ హేళనగా నవ్వాడా యువకుడు. అతని మాటలని పట్టించుకోనట్టు ఉండిపోయాడు మజీద్. లోలోపల మనసు మండిపోతుంటే పళ్ళు గిట్టకరిచాడు. ఇప్పుడు తనేం మాట్లాడే పరిస్థితిలో లేడని అతనికి తెలుసు. ‘జరిగినదానికి చాలా బాధగా ఉంది మజీద్’ అన్నాడు అజీజ్. తలపైని బట్ట సవరించుకుంటూ నిస్సత్తువగా ఒక్క నవ్వు నవ్వాడు మజీద్. ‘జీవితంలో మనకు బలం, అధికారం లేనప్పుడు ఓర్పు, క్షమ అలవర్చుకోవాలని నేర్చుకున్నాను. ఇప్పుడు వాడు నన్ను కుక్కా అన్నాడు.. కానీ ఈ దేశం దహనమైపోతుంటే వీళ్ళలో ఒక్కడైనా ముందుకు రావడం మనం చూశామా?’ రెప్పల వెనుక కన్నీటిని దాచేశాడు మజీద్. అంగీకారంగా తలూపి అజీజ్ ఓ వార్తాపత్రికను తీసుకుని హెడ్ లైన్స్ చదువుతుండగా ఓ విషయం అతన్ని ఆకర్షించింది. ‘పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.’ ‘మజీద్! శుభవార్త! సంచారజాతులకు పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ప్రయత్నిస్తోందట! ఇకపై నువ్వు దేశదిమ్మరివని అనిపించుకోనక్కరలేదు.’ ‘హు! ఈ సర్కస్ ఎన్నిసార్లు చూడలేదు అజీజ్! పార్లమెంటులో బిల్లు పెట్టాము అన్న మాటలతో చాలా అలసిపోయాను. ఈ వారంలో నేను జమీలాను తీసుకుని ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. కేవలం సంచారజాతి వాడినైనందుకు డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేదు తెలుసా? మేమలా పుట్టడం నేరమా? మేము మనుషులం కామా?’ ‘నిజమే కానీ, అసలు మీ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. మీలో కొంతమంది మాలాంటి పౌరులకన్నా ఎక్కువ కాలంగా ఇక్కడుంటున్నారు. కానీ ఎడారి ప్రాంతాలలో మిమ్మల్ని వలసదారులుగా చూస్తారు. మరికొందరు సాధారణ పౌరుల్లా తాము కూడా ప్రయోజనం పొందాలని తమ కాగితాలను కాల్చిపడేసి దేశంలోకి చొచ్చుకుని వచ్చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ, చట్టాన్ని గౌరవించేవారినీ ఎలా తెలుసుకోవాలని? ఈ సమస్యకు పరిష్కారం సాల్మన్ రాజు కూడా చూపలేడేమో!’ ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, కానీ ఈ నిరీక్షణ, ఇంత అన్యాయం.’ ‘చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి!’ ‘1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం గురించి మా నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తు. ఆర్మీలో చేరి, అందులో పనిచేయడానికి సంచారజాతులవారిని ఉపయోగించుకుంటారు కానీ యుద్ధమైపోయాక మాదారి మాదే.. ఎడారి వైపే. దీనివల్ల మానాన్న ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు, కేవలం వాళ్ళకి ఉపయోగపడ్డారంతే! కొంతమందికి కంటితుడుపుగా ఏవో కొన్ని అవార్డులిచ్చారే కానీ పౌరులు యుద్ధంలో పాల్గొంటే ఇచ్చేదాని ముందు ఇదెంత? ఎంత దారుణంగా వివక్ష చూపుతున్నారో, మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంక మాకు గౌరవం ఏముంటుంది!’ నిట్టూరుస్తూ, ‘నిన్న పుచ్చకాయలు అమ్ముతున్నాడని బద్రుని అరెస్టు చేశారట తెలుసా?’ అన్నాడు మజీద్. అద్దాలు సరిచేసుకుంటూ పత్రికలోంచి తలెత్తి చూశాడు అజీజ్. అతనికేం చెప్పాలో తోచలేదు. అతని అదృష్టం కొద్దీ మధ్యాహ్న ప్రార్థనల కోసం మసీదు నుంచి వచ్చిన పిలుపు గాలిని నింపేసింది. ఇద్దరూ తమ తమ చాపల్ని పరుచుకొని మక్కావైపుకు తిరిగి ప్రార్థించసాగారు. లయబద్ధంగా ప్రార్థన చేస్తున్నవారి కంఠం నుండి వస్తున్న శ్లోకాలు ఆ మధ్యాహ్నవేళ నిశ్శబ్దాన్ని కరిగించసాగాయి. ఓ పదిహేను నిమిషాల పాటు వీధులన్నీ స్తబ్ధుగా మారినా, వెంటనే మళ్ళీ మామూలే.. ఉరుకులు, పరుగులు. ఆ ఇద్దరూ ఒకరు దేశపౌరుడు, మరొకరు సంచార జాతివారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే భగవంతుని ముందు మోకరిల్లారు. బహుశా ఆయనకి స్వర్గానికి, మనుషుల మనసులకు తేడా తెలియదేమో! చాప మడుస్తూ ఎందుకనో మజీద్ ఆలోచనలో పడ్డాడు. ‘ఏమిటంత ఆలోచన మజీద్?’ ‘మా సంచారజాతుల వాళ్ళమంతా కూడా సంచారజాతి దేవుడినే ప్రార్థించాలేమోనని!’ ‘ఛ! ఏమిటా మాటలు?’ గట్టిగా అరిచాడు అజీజ్. ‘ఒక్కోసారి భగవంతుడు గుడ్డివాడు, చెవిటివాడు అనిపిస్తుంది. సిగ్గుతో తన ముఖం చూపించలేక దాచుకున్నాడనిపిస్తుంది. ఎంత కాలమిలా? మా ప్రాణాలు విసిగిపోయాయి! అందుకే నేను..’ ‘నిరాశతో దైవదూషణకు పాల్పడవద్దు మజీద్! మరి నేను ఏ దేవుడిని ప్రార్థించాలని? ఏ దేవుడైతే నాకు ఇంటినీ, కుటుంబాన్నీ ఇచ్చాడో అదే దేవుడు వాటిని నాశనం కూడా చేశాడు. అంత మాత్రాన నేను మరో దేవుడిని ప్రార్థించాలా? మన జీవితాలే మనకు పాఠాలు కావాలి అంతే!’ స్నేహితుని భుజం తడుతూ అన్నాడు అజీజ్. ‘అంటే, ఇదే న్యాయమంటావా?’ ‘కావచ్చేమో! అయితే అది తెలుసుకోవడానికి మనం తెరవాల్సింది కళ్ళు కాదు, మనసు! ఒక్కోసారి ఎంత తరచి చూసినా ఇవన్నీ మనకు అర్థంకావు కూడా. యుద్ధక్యాంపులోని నా జీవితం ఇతరులకి సహాయం చేయడంలో తప్ప మరెందులోనూ అర్థం లేదని తెలిపింది.’ అర్థం లేని నిరీక్షణలో, నిరాశతో కుంగిపోయిన తన స్నేహితుడివైపు జాలిగా చూశాడు అజీజ్. మజీద్ తన పౌరసత్వం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాడో అతనికి బాగా తెలుసు. జీవితంలో ఏ హక్కులూ, అంతెందుకు ఓ గుర్తింపు కూడా లేకపోవడమంటే మనిషినెంత వేధిస్తుందో అజీజ్కి బాగానే అర్థమవుతోంది. అతనికి మజీద్ పరిస్థితి తలలేని మొండెంలా అనిపిస్తోంది. మజీద్ స్థితిగతుల్ని ఏ మాత్రం మార్చలేని తను చూపించే జాలి, సానుభూతి ఎంత వరకు ఉపయుక్తమో తల్చుకున్న కొద్దీ బాధ కలిగిస్తోంది అతనికి. ‘మంచిరోజులు వస్తాయిలే మజీద్!’ ఆశావహంగా అన్నాడు అజీజ్. ‘నాకు మా తండ్రి మరణించిన రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు మా నాన్న శవం అనామకంగా.. ఆయన తండ్రిలాగే ఎక్కడో పూడ్చిపెట్టామే తప్ప ఆయనకో గుర్తింపు లేదని గ్రహించలేకపోయాను. రేప్పొద్దున నేనైనా అంతే! అదేమంత బాధ కాదు కానీ, రాబోయే తరాలు తమ తాతముత్తాతలని ఎక్కడ పూడ్చిపెట్టారో కనీసం తెలుసుకుంటారు. అవి తమకు చెందినవేనని అర్థంచేసుకుంటే అదో తృప్తి, అంతే! మాలాంటి వాళ్ళంతా అంతే, ఎక్కడ పుట్టామో, ఎక్కడికి వెళుతున్నామో, మాకంటూ ఓ ఉనికీ, దానికో నిదర్శనమూ ఏదీ ఉండదు’ అన్నాడు మజీద్. ‘సరే, ఇక భోంచేద్దాం పద’ మనసుని తొలిచే ఈ అంశం నుండి మజీద్ దృష్టి మరల్చడానికి అజీజ్ అన్నాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అజీజ్ తన భోజనాన్ని తీసుకొచ్చాడు. రొట్టె, పెరుగు తెచ్చుకోవడానికి మజీద్ బైటికెళ్ళాడు. ప్రతిరోజూ అతను అలీబాబా బేకరీ వాళ్ళు వందమందికి చేసే దానంలో ఈ రొట్టె, పెరుగు తెచ్చుకుని భోంచేస్తుంటాడు. ఈజిప్టు దేశ కార్మికులు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, భారతీయులు ఎక్కువ భాగం ఈ అలీబాబా వారి ఔదార్యంతోనే జీవిస్తుంటారు. ప్రతిఒక్కరికీ వెచ్చని నాలుగు రొట్టెలు, ఓ సీసాడు పెరుగు.. దీనికోసం ఎంతోమంది క్యూ కడుతుంటారు. అదేం పోషకాహారం కాకపోయినా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది మరి! ప్రత్యేకమైన రోజుల్లోనూ, రంజాన్ మాసంలోనూ అతను మసీదులో పెట్టే భోజనంతోనే గడిపేస్తుంటాడు. వీలైతే తన ఇంట్లోవారి కోసం ఓ ప్లాస్టిక్ సంచిలో అక్కడి నుండి భోజనపదార్థాలు తీసికెళుతుంటాడు. తన రొట్టె, పెరుగు తీసుకుని మజీద్ గబగబ అజీజ్ దుకాణానికి పరిగెట్టాడు. అక్కడ అజీజ్ తన కోసం ఎదురు చూస్తుంటాడు మరి! ప్రతిరోజూ తెల్లవారే అజీజ్ తన మధ్యాహ్న భోజనాన్ని వండుకుని తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా మాంసం వండుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే వండి మజీద్ కోసం తెస్తుంటాడు. అజీజ్ తన డబ్బా మూత తెరిచేసరికి వంటకాల ఘుమఘుమలు షాపంతా అల్లుకున్నాయి. దాంతో ఇంటి గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మజీద్. ఫరీదా కుట్లు అల్లికల్లో ఎంతో నిష్ణాతురాలు. అలా సంపాదించిన డబ్బుతో ఆమె మాంసమూ, ఎప్పుడైనా పిల్లలు జబ్బు పడినప్పుడు మందులకూ ఉపయోగిస్తుంటుంది. బాగా డబ్బున్న ఓ అరబ్బీ ఆవిడకు ఫరీదా చేసే ఎంబ్రాయిడరీ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఫరీదాని తన కోసం మరిన్ని ఎంబ్రాయిడరీ పనులు చేసివ్వమని అడుగుతుంటుంది. తన చేతివేళ్లు నొప్పి పుట్టినా, కళ్ళకు శ్రమ కలిగినా సరే, వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయాన్ని ఫరీదా వదులుకోదు. పిల్లలు ఎలాగూ బడులకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనో, ఆ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటిపనీ, ఎంబ్రాయిడరీ పనీ, పిల్లలని చూసుకోవడంతో ఆమెకు పొద్దు చాలదు. అయినా ఎంతో నేర్పుతో అన్నీ సంబాళించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనికురాలు పిల్లలకోసం పాలపొడి, పిండి.. జమీలా, సిరాజ్, ఒమర్లకు తన పిల్లల పాతబట్టలను కూడా ఇస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకదే కాస్త ఊరట కలిగించే విషయం. ‘మాంసం చాలా చక్కగా వండావు అజీజ్, కాస్త నా రొట్టె కూడా తీసుకో. దీంతో పాటే అది కూడా బాగుంటుంది’ అన్నాడు మజీద్. ‘అయితే ఈ అన్నాన్ని ఎవరు తింటారు? ఈసారి నీ రొట్టె కోసమే వస్తాన్లే’ చిన్నగా నవ్వాడు అజీజ్. వెన్నెల్లాంటి ఆ నవ్వును చూస్తూ మజీద్ ‘నిజమే, దేవుడున్నాడు’ అనుకున్నాడు. ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. ఆ రాత్రి చీకటి దట్టంగా పరుచుకున్న ఆకాశంవైపు చూడసాగాడు మజీద్. గాలి ఈలలు వేస్తూ వచ్చి ఇసుక తిన్నెలపై వాలి అక్కడే ఆగిపోతోంది. ఒంటెలు వాళ్ళుంటున్న పరిసరాల్లో అటూ ఇటూ బద్ధకంగా తిరుగుతున్నాయి. కిటికీ దగ్గరగా కూచుని అతను మనసారా ప్రార్థన చేసుకుని ఆకాశం వైపు చూశాడు. మేఘాలన్నీ దక్షిణం వైపు జరిగిపోవడంతో ఓ నక్షత్రం ఆ ప్రదేశాన తళుక్కుమంది. చంద్రుని చూసిన చకోరంలా అతని ఎద ఎగిసిపడింది. ఇంతకుముందు ఒకసారి అజీజ్ తన షాపులో సామాను ఉంచుకోవడానికి అనుమతినిచ్చినపుడు ఇలాగే.. ఓ తార నీలాకాశంలో తళుక్కుమంది! ఆశనిరాశల ఈ ఊగిసలాటలో తన కుటుంబాన్ని చంపేసి, తను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులవి. తన పనిముట్లున్న సంచిని పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఓ షాపు ముందు అలిసిపోయి కూచుంటే.. అప్పటికది అజీజ్దని తనకి తెలియదు. మధ్యాహ్నపు ఎండకు సోలిపోతుంటే అజీజ్ తనని లోనికి రమ్మని మంచినీళ్ళిచ్చి వివరాలు కనుక్కున్నాడు. అప్పటి నుండే తన జీవితం చిన్న మలుపు తిరిగింది మరి! ‘ఎందుకు నాన్నా నవ్వుతున్నారు?’ తండ్రితో పాటు ఆకాశంలోకి చూస్తూ అడిగాడు ఒమర్. తాము కూడా కళ్ళువిప్పార్చుకుని చూస్తూ తండ్రిని చుట్టుముట్టేశారు సిరాజ్, జమీలాలు. ఫరీదా భర్త వైపు చిరునవ్వుతో ఓసారి చూసి తన పనిలో పడిపోయింది. మజీద్ తన పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్న అతను పిల్లలను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఏదో శుభసూచకం అతని మనసుకి తోస్తోంది. కచ్చితంగా మంచిరోజు వస్తోంది! శుక్రవారం గాలిలో ఏదో మత్తు జల్లినట్టు తెల్లవారింది. ఎందుకనో ఆ వేళ ప్రార్థనలకు మసీదుకు వెళ్ళాలనిపించింది మజీద్ మనసుకి. మధ్యాహ్న ప్రార్థనలయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్లో ఎవరో బోర్లా పడి ఉండడం కనిపించిందతనికి. ఆ అబ్బాయిని తిప్పి చూసిన మజీద్ అతని ముఖం మీద రక్తపు చారికలు కనిపించేసరికి నివ్వెరపోయాడు. స్ప్పహ తప్పిన అతన్ని చేతుల్లోకి తీసుకుని దారేపోతున్న ఓ లారీని ఆపి దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్యాజువాల్టీ వార్డులో ఆ అబ్బాయిని అప్పగించి, ఆతృతగా బైట నిలబడి ఎదురుచూడసాగాడు. ఎందుకనో తను ఇబ్బందుల్లో పడబోతానేమో అనిపించింది అతనికి. ఇక ఇంటికి వెళదాం అనుకున్నంతలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న ఓ డాక్టర్ అతన్ని ఆగమని సైగ చేశాడు. గుండె దడ పుట్టి, ఏదో కడుపులో తిప్పుతున్న భావన అతనిలో! నొసలంతా చెమటలు పట్టి, కంఠం పొడిబారిపోయింది అతనికి. ఇంతలో తళతళలాడే ఓ నల్లని జాగ్వార్ కారు ఆస్పత్రి ముందు ఆగింది. అందులోంచి కలవరపాటుతో మొహం ఉబ్బిపోయిన ఓ అరబ్ దిగాడు. ఆందోళనకు చిరునామాలా ఉన్నాడతను. పైబట్టని సర్దుకుంటూ, జారిపోతున్న నల్లని దుస్తులని సరిచేసుకుంటూ లోనికి అడుగుపెట్టాడు. శరీరం వణికిపోతుండగా అతను మజీద్ని దాటి క్యాజువాల్టీ వార్డులోపలికి వెళ్ళాడు. మనసు లోపల్లోపల తను ఏ తప్పూ చేయలేదని తెలిసినా, అతన్ని ఏదో తెలియని భయం ఆవరించింది. శక్తినంతా కూడగట్టుకుని పారిపోదామనుకున్నంతలో, ఇంతకు ముందు మొబైల్ ఫోన్లో మాట్లాడిన డాక్టరూ, ఈ అరబ్బూ కలిసి బైటికొచ్చారు. కొంతసేపు వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ.. ఆ డాక్టరు మజీద్ వైపు చూపించడమూ, ఆ అరబ్బు అతన్ని దగ్గరికి రమ్మని సైగ చేయడమూ జరిగిపోయాయి. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయి మజీద్ కదల్లేకపోయాడు. ఇంతలో ఆ అరబ్బు అతని దగ్గరికొచ్చి కష్టంతో కరకుదేరిన మజీద్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంతగా మజీద్ మనసు మొద్దుబారిపొయింది. ‘అల్లా హు అక్బర్! నువ్వు లేకపోతే మా అబ్బాయి రోడ్డు మీదే చచ్చిపోయుండేవాడు. ఆ దేవుడే నిన్ను పంపాడేమో! నీ పేరేంటి?’ వణుకుతున్న పెదాలతో అడిగాడా అరబ్బు. ‘మజీద్.’ ‘ఏం చేస్తుంటావు?’ ‘చెప్పులు కుడతాను.’ ‘ఎక్కడుంటావు?’ ‘పనార్లో, నేనో సంచారజాతివాడిని.’ క్షణంపాటు స్థాణువైన అరబ్బు మాటలకోసం వెతుక్కున్నాడు. ‘నీతోపాటు ఎవరెవరున్నారు?’ ‘నా భార్య, ముగ్గురు పిల్లలు.’ ‘వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేయకూడదూ! నువ్వు మా ఇంట్లో తోటపని చేద్దూగానీ. మీ పిల్లల్ని చదివిస్తాను, నీ భార్యని కాస్త తేరుకోనీ!’ మజీద్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఉన్నట్టుండి అతనికి మిలమిల్లాడే ఆ నక్షత్రం గుర్తుకొచ్చింది. ఎంత కాకతాళీయం! దేవుడు తన కష్టాలని కడతేర్చ నిశ్చయించాడేమో! కన్నీళ్ళతో ముఖం తడిసిపోతుండగా మజీద్ మక్కా వైపుకు తిరిగి మోకరిల్లాడు. ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు! విచారిస్తున్న అజీజ్ని ఓదార్చాడు మజీద్. అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్! చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి! ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. — మూల కథ : ది సైన్ (ఇంగ్లిష్) రచయిత్రి : స్నేహ సుసాన్ షిబు తెలుగు అనువాదం: డాక్టర్ యు విష్ణుప్రియ. ఇవి చదవండి: Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం! -
శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు. తెలుగులో అంతటి శివతాండవం ఉంది. “సరస్వతీపుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి…వెలుగుతూ ఉండడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన మాటల్లో తెలిసేది. నిజానికి బాధపడాల్సింది మనం. పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం “పెనుగొండ లక్ష్మి” విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు. పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తివారే ముందుమాటగా, చివరి మాటగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం. పుట్టపర్తివారి శివతాండవ కావ్యసారమిది అని చెప్పేంత మంత్ర, నాట్య, సంగీత, సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం నాకు లేదు. ఇరవై ఏళ్ల వయసులో హిందూపురంలో ప్రఖ్యాత తెలుగు విద్వాంసుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ దగ్గర కొన్నేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం, ఛందస్సు- అలంకారాలు నేర్చుకునే భాగ్యం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లేవరకూ తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్న రెండు సాహితీ హిమవన్నగాలు ఉన్నాయనే నాకు తెలియదు. భాషలో ఏ ఉదాహరణ అయినా వీరిద్దరి కావ్యాల ప్రస్తావనతోనే చెప్పేవారు. కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన పుట్టపర్తివారితో కలిసి పనిచేశారు. అలా నాకు శివతాండవమంటే పులకింత. పూనకం. ఒళ్లు తెలియదు. అర్థం తెలియకుండానే కొన్నేళ్లపాటు పాడుకుంటూ ఉండేవాడిని. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా వాటి ఆకార పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది. శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు. “ఆడెనమ్మా శివుడు. పాడెనమ్మా భవుడు. ఏమానందము? భూమీతలమున! శివ తాండవమట! శివ లాస్యంబట!” ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడికి కావ్యం సమాప్తం. శివ అంటే చైతన్యం. ప్రాణం. స్పందన. శుభం. మంగళం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు. ఆ హిందీ అనువాద గ్రంథం ఇటీవల ముద్రణకు నోచుకుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018 -
మహాశివరాత్రి: ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. ఏడాదిలో వివాహం!
భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. వీటినుంచి విముక్తి కోసం రకరకాల పూజలు, శాంతులు చేస్తూ ఉంటారు. జాతకాలు, దోషాలు అంటూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ శివాలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని భక్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక దేవాలయం గురించి , దాన్ని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం కళ్యాణసుందర్ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ (చేతిలో చేయి వేసి పట్టుకున్న) స్థితిలో దర్శనమిస్తారట. ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులవిశ్వాసం. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా ఆమూడుముళ్ల వేడుక జరుగుతుందని భక్తులు నమ్ముతారు . తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి బ్లాక్లో ఉందీ దేవాలాయం. దీని పేరే మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని ప్రతీతి. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే బైరవ, వశిష్టర్, అగస్తియర్ల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా సందర్శించే దేవాలయం. పురాణాల ప్రకారం, మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడట. మాంగల్య మహర్షి తపస్సు చేసి సంపాదించిన అపారమైన శక్తి మహిమతో ఇది సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన దేవదూతలకు గురువైనందున, ఆయన ఆశీర్వాదంతో శ్రీఘ్రమే వివాహాలు జరుగుతాయని, అమోఘమైన వరాలను అనుగ్రహిస్తారని నమ్ముతారు.వివాహానికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు పైనుండి ఆశీర్వది స్తారని కూడా నమ్ముతారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా, చెన్నైలోని తిరువిందందై అనే గ్రామంలో ఉన్న నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం సహా ఇలాంటి టెంపుల్స్ చాలా ఉండటం విశేషం. -
మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..!
మహాకవి ధూర్జటి 'శ్రీ కాళహస్తీశ్వర శతకం'లో శివనామ ప్రాభవం, ప్రభావం గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు. "పవి పుష్పంబగు,అగ్ని మంచగు.. శత్రుం డతిమిత్రుడౌ..విషము దివ్యాహారమౌ..." అని అంటాడు. "శివ శివ" అంటూ శివుడిని తలుచుకుంటే చాలు! అన్నీ నీకు వశమవుతాయని అంటాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధం లలిత లావణ్యమైన పుష్పంగా రూపు మార్చుకుంటుంది. అగ్ని పర్వతం కూడా మంచు పర్వతంగా మారిపోతుంది, సముద్రమంతా ఇంకిపోయి, మామూలు నేలగా మారిపోతుంది. పరమశత్రువు కూడా అత్యంత స్నేహితుడవుతాడు, విషము దివ్యమైన ఆహారంగా మారిపోతుంది. ఇలా...ఎన్నో జరుగతాయని, అనూహ్యమైన ఫలితాలు, పరిణామాలు ఎన్నెన్నో సంభవిస్తాయని ఈ పద్యం అందించే తాత్పర్యం. అంతటి వశీకరణ శక్తి శివనామానికి వుంది. అతి శీఘ్రంగా భక్తులను కరుణించి, వరాల వర్షాలు కురిపించే సులక్షణభూషితుడు హరుడు. భోళాశంకరుడు, భక్తవశంకరుడు శివదేవుడు. పాల్కురికి సోమనాథుడు నుంచి శ్రీనాథుడు వరకూ,పోతన నుంచి విశ్వనాథ వరకూ,ధూర్జటి నుంచి కొప్పరపు కవుల వరకూ మహాకవులెందరో శివుడిని ఆరాధించినవారే. పంచాక్షరీ మంత్రోపాసనలో పరవశించినవారే. కవులందరూ శివులే. భవ్యకవితావేశంతో శివమెత్తినవారే. శివరాత్రి వేళ స్త్రీ,బాల, వృద్ధులందరూ ఉరిమే ఉత్సాహంతో శివమెత్తి నర్తిస్తారు. ఆ ఉత్సాహం ఉత్సవమవుతుంది. హిందువులకు,ముఖ్యంగా శివారాధకులకు 'మహాశివరాత్రి' గొప్ప పండుగరోజు. శివపార్వతుల కల్యాణ శుభదినంగా, శివతాండవం జరిగే విశేషరాత్రిగా పరమపవిత్రంగా పాటించి వేడుకలు జరుపుకోవడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. శివపురాణం ప్రకారం శివుడు లింగాకారుడుగా మారే రోజుగా శివపురాణం చెబుతోంది. ఏ రీతిన చూసినా, ఏ తీరున చెప్పినా, ఏ లీలగా భావించినా ఇది పుణ్యదినం, భక్తులకు ధన్యదినం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం చేయడం, శివ తపో ధ్యానాలతో తన్మయులవడం సర్వత్రా దర్శనమవుతూ ఉంటాయి. శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా విశేషాల కథా పారాయణలు కోట్లాదిమంది ప్రపంచమంతా జరుపుతారు. బిల్వపత్రాలతో అర్చన చేస్తే శివుడు అత్యంతంగా ఆనందిస్తాడని భక్తులు నమ్ముతారు. "మా రేడు నీవని ఏరేరి తేనా? మారేడు దళములు నీ పూజకు " అన్నాడు వేటూరి. ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, శివభక్తులు తెల్లవారుజామునే లేవడం క్రమశిక్షణగా పాటిస్తారు. విభూతి ధారణ చేసి "ఓం నమఃశివాయ" అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే ఎంతో శక్తి చేకూరుతుందని, ఎన్నో విశేషఫలితాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. తపస్సు, యోగాభ్యాసం, ధ్యానం గొప్ప ఫలితాలను అందిస్తాయన్నది అనాదిగా పెద్దలు చెబుతున్నది. మంత్రోపాసనలు గొప్ప వైభవాన్ని, రక్షణను కలిగిస్తాయని ఆర్యవాక్కు. పంచాక్షరీ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం విశేషంగా భావిస్తారు. శివుడిని ప్రధానంగా యోగకారకుడుగా అభివర్ణిస్తారు. మహాశివరాత్రి నాడు జాగరణ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మిక శోభ, గొప్ప ఆరోగ్యం లభిస్తాయనే విశ్వాసంతో కోట్లాదిమంది తరతరాల నుంచి మహాశివరాత్రిని పరమనిష్ఠగా జరుపుకుంటున్నారు. రాత్రంతా సంగీత,సాహిత్య, నాటక,కళా ప్రదర్శనలతో మార్మోగి పోతుంది. ఎంతోమంది ద్వాదశ లింగాల దర్శనానికి సమాయిత్తమవుతారు. రుద్రాభిషేకం విశేషంగా జరుపుకోవడం పరిపాటి. తెలుగునాట ఎన్నో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలోని కోటప్పకొండ ప్రభ తీరే వేరు. కోటప్పకొండ తిరునాళ్ల చాలా ప్రసిద్ధి. శ్రీశైలం,శ్రీకాళహస్తి, భీమేశ్వరం వంటి క్షేత్రాలలో జరిగే విశేషపూజలు, భక్తుల కోలాహలం చెప్పనలవి కాదు. తెలంగాణలో రుద్రేశ్వరస్వామి వెయ్యి స్థంభాల ఆలయం, కీసరగుట్ట, వేములవాడ మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఐశ్వర్యప్రదాతలై విలసిల్లుతున్నాయి. శివుని ఆరాధన సర్వశక్తికరం, సర్వముక్తిప్రదం. శివరాత్రి నాడు జరిగే పూజలను దర్శించుకున్నా పుణ్యప్రదం. నాలుగు యామాలుగా పూజలు నిర్వహిస్తారు. అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరీ మంత్రం ప్రకృతిలో భాగమైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో ముడిపెట్టుకొని ఉంటుంది. శివుడిని పంచముఖునిగా, పంచబ్రహ్మలుగా భావిస్తారు. చైతన్యం దీని మూలసూత్రం. శివతత్త్వమే పరమోన్నతం. నిస్వార్థం, నిరాడంబరత ఆయన సుగుణధనాలు. మహాశివస్మరణ సంబంధియైన మహాశివరాత్రి అర్చనలు మానసిక ప్రశాంతతకు మూలం, శారీరక శక్తికి కేంద్రం, ముక్తికి సోపానం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశీ నుంచి కాళహస్తి దాకా, నేపాల్ నుంచి పాకిస్తాన్ దాకా కోటి ప్రభలతో,కొంగ్రొత్త శోభలతో కోలాహలంగా సాగే 'మహాశివరాత్రి' ధరిత్రిని పవిత్రంగా నిలిపే పుణ్యరాత్రి, శివగాత్రి. పాకిస్తాన్ లోని కరాచీలో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంతో ప్రసిద్ధం. కొన్ని వేలమంది ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మన వలె ఉపవాస దీక్ష ఆచరిస్తారు, సముద్రస్నానం చేస్తారు. శివరాత్రిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకంగా పిలుచుకుంటారు. కశ్మీర్ లో 'హరరాత్రి' అంటారు. ఒరిస్సావారు 'జాగరా' అంటారు. జాగరా అంటే జాగారం చేయడం, అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం. పంజాబ్లో శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఇలా ఏ పేరుతో కొలిచినా, తలచేది శివుడినే. దివ్యశివరాత్రి మనలో భవ్య భావనలు నింపుగాక! - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఆర్బీఐ హెచ్చరిక..బద్దలవుతున్న రామోజీ బాగోతం
-
Magazine Story: ఆ విషయంపై బహిరంగ చర్చకు దమ్ముందా చంద్రబాబు?
-
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
గన్ షాట్..యాత్ర 2 మూవీ ఒక సంచలనం..నడుస్తున్న చరిత్ర
-
జన..దేశం..శానా కష్టం
-
అసలైన రత్నానికి సిసలైన గుర్తింపు
-
అందుకే ఆయన మహాత్ముడు
అవి గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలో అడుగు పెట్టినప్పటి రోజులు. ఓరోజు గాంధీజీ తన మిత్రుడితో కలిసి అతని కారులో ప్రయాణం చేస్తున్నారు. గాంధీజీ అలా ప్రయాణం చేయడం నచ్చని కొందరు వ్యతిరేకులు ఆయనకు అడ్డంకులు కల్పించడానికి గాను ఓ చెట్టు చాటు నుంచి కారుపై రాళ్లు రువ్వారు. రాళ్ళు కారుమీద పడగానే గాంధీజీ మిత్రుడితో కారును ఓ పక్కగా ఆపమన్నారు. అనంతరం ఆయన నెమ్మదిగా కారు లోంచి కిందకు దిగారు. చుట్టూ చూశారు. కనుచూపుమేరలో ఓ చెట్టు దగ్గర నిల్చున్న కొందరిని గాంధీజీ చూశారు. వారు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. దాంతో తిన్నగా వారి దగ్గరకు వెళ్లారు. కారు మీద రాళ్ళు విసిరిన వారు వారే అయి ఉండొచ్చని అనుకున్నారు. వారిని సమీపించి ‘‘మీకు నా మీద కోపం ఉండొచ్చు. కాదనను. ఆ కోపం మీ వరకూ సబబే కూడా అయి ఉండొచ్చు. అది కూడా నేను కాదనను. అయితే, మీ కోపాన్ని చూడానుకుంటే రాళ్ళు నామీద విసరాలే తప్ప పాపం ఈ కారు ఏం చేసింది? అంతేకాదు, ఆ కారు కూడా నాది కాదు. నా మిత్రుడిది. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు మీ కోపాన్నినా మీద చూపండి. ఇదిగో మీముందే నిల్చున్నాను. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి, నేను మీ ముందు ఒంటరిగా నిల్చున్నాను. నన్ను మీరేమైనా చేసుకోవచ్చు. అందుకు నేనేమీ అనుకోను. కారు మీద రాళ్ళు విసరడం మాత్రం తప్పు. ఎందుకంటే అది మిమ్మల్నేమీ చెయ్యలేదు. చెయ్యదు కూడా. అయినా మీరు రాళ్లు విసరడం వల్ల అది నాశనమవుతుంది. అప్పుడు నా మిత్రుడు బాధపడతాడు. నష్టం అతనికి తప్ప నాకు కాదుగా...’’ అని గాంధీజీ చెప్పడంతో ఆయనను ఆట పట్టించాలనుకున్న వాళ్ళు గాంధీజీ మాటలకు సిగ్గుపడి తల దించుకున్నారు. కాస్సేపు అక్కడ మౌనం తాండవించింది. అనంతరం ఆ అల్లరిమూక గాంధీజీ కాళ్ళపై పడి తమను క్షమించాలని అడిగారు. గాంధీజీ చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా వారితో కరచాలనం చేశారు. క్షమ లేకనే మనం మామూలు వాళ్లలా ఉన్నాము. క్షమాగుణం వల్లనే గాంధీజీ మహాత్ముడయ్యాడు. అందుకే క్షమ కలవాడు అందరికన్నా బలమైన వాడని సామెత. – డి.వి.ఆర్. -
కుట్ర..మోసం..దగా..జీవితాన్ని ఇచ్చిన జీజే రెడ్డికి వెన్నుపోటు
-
National Tourism Day: అందమైన, అద్భుతమైన ద్వీపాలు!
# National Tourism Day 2024 పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకుభారీ ఊతమిచ్చే పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన, చైతన్యం పెంచే ఉద్దేశంతో ఈరోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. 2022లో, భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు, అనేక రాష్ట్రాలు తమ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. థీమ్: ప్రతి సంవత్సరం, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని విభిన్న థీమ్తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా జరుపుకుంటారు. 'సుస్థిర ప్రయాణాలు, కలకాలంనిలిచిపోయే జ్ఞాపకాలు అనేది ఈ ఏడాది థీమ్గా నిర్ణయించారు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం ఇండియాలో అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపధ్యంలో లక్షద్వీప్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ దీవులు: దేశంలోనే అతిపెద్ద ద్వీప సమూదాయం. బంగాళాఖాతంలోని 572 దీవుల సమూహం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలలో పోర్ట్ బ్లెయిర్, హేవ్లాక్ ద్వీపం, నీల్ ద్వీపం ,బరాటాంగ్ ద్వీపం పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. హనీమూన్, ఇతర వెకేషన్లకు అద్భుతమైన డెస్టినేషన్. బ్లూ వాటర్ బీచెస్, కోరల్స్ దీవులు చాలా అందంగా కన్పిస్తాయి. లక్షద్వీప్ దీవులు: అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ భారతదేశంలోని మరొక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలు కవరత్తి, అగట్టి, మినీకాయ్ . మజులి ద్వీపం: అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులి ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికీ క్యూ కడతారు. రామేశ్వరం ద్వీపం రామేశ్వరం, తమిళనాడు తమిళనాడులో ఉన్న . దీన్నే పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్స్: కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐల్యాండ్ వాస్తవానికి 4 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది కర్ణాటక ఉడుపి సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్, క్లియర్ బ్లూ వాటర్ పర్యాటకుల్ని అబ్బురపరుస్తాయి. ఎలిఫెంటా ద్వీపం: ముంబై హార్బర్లో ఉంది, ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం, రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది. దివార్ ద్వీపం: ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఐలాండ్ ఆఫ్ ప్యారడైజ్గా పిలుస్తారు. సుందర్ బన్స్: సాంప్రదాయ ద్వీపాలు కానప్పటికీ, సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్లోని విస్తారమైన డెల్టా ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, జలమార్గాలు, ద్వీపాలు మడ అడవులు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement