ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు. శుక్రవారం నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత సాయంత్రమే మాక్లూర్ మండలంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కూడా అదేరోజు సాయంత్రం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నగరంలో ప్రచారాన్ని ప్రారంభించారు. సోమవారం మరోసెట్ నామినేషన్ వేసిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ప్రచార బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
సాక్షి, నిజామాబాద్ : నామినేషన్ల ఘట్టా న్ని పూర్తి చేసుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు. ప్రచారానికి కేవలం 17 రోజులే సమయం ఉండటంతో ఉన్న సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత సాయంత్రమే మాక్లూర్ మండలంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకా రం చుట్టారు. మానిక్బండార్లో రోడ్ షో నిర్వహించారు. శనివారం జగిత్యాల జిల్లాలో ఆమె ప్రచారం కొనసాగింది. సాయంత్రం కమ్మర్పల్లి మండలంలో రోడ్షో జరిగింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనుండగా రెండు రోజుల ముందు అభ్యర్థుల ప్రచార పర్వానికి తెరపడుతుంది. ఈ మేరకు ఏప్రిల్ 9 వరకు రోజువారీ ప్రచార ప్రణాళికను కవిత తయారు చేసుకున్నారు.
ఈ మేరకు పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాల పరిధిలో అన్ని మండలాలు, వీలైనన్ని గ్రామాలు చుట్టి వచ్చేలా షెడ్యూల్ రూపొందించారు. రోడ్షోలు, ఓటర్లను నేరుగా కలవడం, ఇలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రచార సభలను కూడా నిర్వహించేందుకు సం బంధిత ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే రెట్టింపు మెజారిటీ సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్న కవిత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు వం టి పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలతో మమేకమవుతున్నారు.
ఆర్మూర్ సభకు సన్నాహాలు..
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కూడా శుక్రవారమే ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. సాయం త్రం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నగరంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం ఆర్మూర్ నియోజవర్గంలో అర్వింద్ ప్రచారం కొనసాగింది. ఈనెల 25న ఆర్మూర్లో బీజేపీ సభను నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ హాజరుకానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న రైతాం గ సమస్యలపై జాతీయ నేతలతో హామీ ఇప్పించడం ద్వారా ఎన్నికల్లో రైతుల మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రేపు శ్రీకారం..
కాంగ్రెస్ అభ్యర్థి, ఏఐసీసీ సభ్యులు మధుయాష్కి గౌడ్ శుక్రవారం తన అనుచరులతో నామినేషన్ పత్రాలను దాఖలు చేయించారు. సోమవారం మరోసెట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాల నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాష్కి ప్రకటించారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో మంగళవారం నుంచి అభ్యర్థుల ప్రచారం జోరందుకోనుంది.