వైరల్‌ : టిమ్‌పైన్‌ కుటుంబంతో రిషభ్‌ పంత్‌! | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 1 2019 2:38 PM

Rishabh Pant Meets Tim Paine's Wife Bonnie Paine  - Sakshi

సిడ్నీ : భారత్‌-ఆస్ట్రేలియాల బోర్డర్‌-గావాస్కర్‌ సిరీస్‌ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో అంతంతమాత్రంగానే కనిపించినా.. మూడో టెస్ట్‌కు వచ్చేసరికి అది తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే ఆటగాళ్లు ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శించుకునేలా! ముఖ్యంగా ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ల మధ్య నడిచిన మాటల తూటాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ తరహా ఆటగాళ్ల స్లెడ్జింగ్‌ మరే వివాదానికి దారితీస్తుందో అని క్రికెట్‌ అభిమానులు కవలవరపడ్డారు. కానీ ఇదంతా ఉత్తదే.. ఆటలో భాగమేనని, మైదానం దాటితే తామంతా మంచి స్నేహితులమని పంత్‌ చాటిచెప్పాడు.

మూడోటెస్ట్‌లో టిమ్‌పైన్‌.. ‘పంత్‌.. నా పిల్లలను ఆడించు.. నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తా!’ అని సరదాగా అన్న వ్యాఖ్యలను పంత్‌ సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ అతను అన్నట్లే పైన్‌ సతీమణి బొనీపైన్‌ను కలిసి వారి పిల్లలను ఆడించాడు. ఈ విషయాన్ని బొనీయే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. అంతేకాకుండా పంత్‌ బెస్ట్‌ బేబీసిట్టర్‌ అని కొనియాడింది.  ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో పంత్‌ బ్యాటింగ్‌ సమయంలో ‘పంత్‌.. ధోని వచ్చాడు కదా.. వచ్చి బీబీఎల్‌ ఆడుకో’  అని పైన్‌ కామెంట్‌ చేయగా.. పైన్‌ బ్యాటింగ్‌ సమయంలో ‘టెంపరరీ కెప్టెన్‌’ అంటూ పంత్‌ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్ట్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మొర్రిసన్‌ను కలిసారు. వీటికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement