సాక్షి, అమరావతి : మంగళగిరి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్కు బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయినట్లే.. మంగళగిరిలో లోకేష్ ఓడిపోవటం ఖాయమన్నారు. ఐదేళ్ల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న చంద్రబాబు మంగళగిరి, తాడేపల్లికి తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం మున్సిపల్ వార్డు గెలుచుకో లేకపోయారు.. ఇక మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్.. పక్కనే ఉన్న సదావర్తి భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ సారి మంగళగిరి వచ్చి పానకాల స్వామి గుడినే మింగేస్తావా అని ప్రశ్నించారు. దత్తత తీసుకున్న నిమ్మకూరు అభివృద్ధి చేయలేని లోకేష్ ఇంక మంగళగిరి ఏమి అభివృద్ధి చేస్తాడు అంటూ విమర్శించారు.