ఎందుకీ దుష్ట సంస్కృతి
విశాఖ అందాల పోటీపై లక్ష్మీపార్వతి ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ వ్యవస్థ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తోందని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మహిళలపై దాడులకు నిరసనగా విశాఖపట్నంలో మంగళవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ చెంచాలా పనిచేస్తోందని, మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో భూకబ్జాలు, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. భూముల కబ్జాపై తూతూ మంత్రంగా కమిటీ వేశారని, ఈ వ్యవహారంలో దర్యాప్తును గాలికి వదిలేశారని అన్నారు.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ పార్టీని భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. కబ్జా రాజకీయాలు, రోడ్డుపై మానభంగాలు ఇదా ప్రభుత్వ విధానమంటూ ప్రశ్నించారు. టీడీపీని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు. అందాల పోటీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే మహిళలను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు విఫలయత్నం చేశారని గుర్తు చేశారు. ఎందుకు ఈ దుష్ట సంస్కృతిని ప్రవేశపడుతున్నారని, దీన్నిబట్టే చంద్రబాబు ఎలాంటివారో అర్థమవుతోందని అన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు.