సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 24 గంటలు గడిచినా వైఎస్ జగన్ సవాల్పై చంద్రబాబు, ఆయన మంత్రులు ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, జవహర్, పత్తిపాటిల నోళ్లు ఎందుకు మూగబోతున్నాయి. మీకు నిజంగా దమ్ముంటే జగన్ సవాల్ను స్వీకరించండి. లేకుంటే పొరపాటు అయిందని ఒప్పుకుని క్షమాపణ చెప్పండి.
చంద్రబాబు గాలి వార్తలు చెప్పడం.. ఎల్లో మీడియా వాటిని రాయడం అలవాటు అయింది. చంద్రబాబు పరువు గురించి ఏం మాట్లాడారు. రాష్ట్రం పరువు తీస్తున్నది ఎవరూ మీరు కాదా?. అలాంటి మీరు వైఎస్ జగన్ గురించి విమర్శలు చేయడమా?. మరి సవాల్ స్వీకరించకుండా ఎందుకు దొడ్డిదారిన పారిపోతున్నారు?. తల్లికి, చెల్లికి, భార్యకు మధ్య తేడా తెలియని సంస్కార హీనులు ఏపీ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రను ముద్దుల యాత్ర అంటూ సంస్కారహీనమైన విమర్శలు చేస్తున్నారు.
జగన్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ప్రజాసంకల్పయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు అనేక కుట్రలు చేశారు. పాదయాత్రకు జనం స్పందన చూసి తట్టుకోలేకే ప్యారడైజ్ పత్రాలు అంటూ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా...స్పీకర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటు పార్టీ మారిన వారితో రాజీనామా చేయించాలి. ఎవరేంటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.’ అని సవాల్ విసిరారు.
దమ్ముంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించండి