సాక్షి, అమరావతి : గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్లు తప్ప ఇంకేమీ కట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ను ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం చేశారని రాజధానిలో తిరగడానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. రాజధానిలో నాలుగు బిల్డింగ్లని 57శాతం నుంచి 90శాతం వరకు కట్టారని, అంతకంటే ఎక్కువ కట్టింది ఒక్కటి కూడా రాజధానిలో లేదన్నారు. రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో మోసపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని చెప్పారు. ఎంత మందికి ప్లాట్లు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు.
మాతృ భాషకు వ్యతిరేకం కాదు
మాతృ భాషకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని బొత్స అన్నారు. పేద విద్యార్థుల కోసమే ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజలందరూ ఇంగ్లీ మీడియాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. సామాన్యులు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అనిప్రశ్నించారు. ప్రజలను నుంచి వ్యతిరేకత రావడంతో ఈ విషయంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.