ఈ వంతెన భూకంపాలనూ తట్టుకుంటుంది! | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 13 2017 2:35 AM

World’s highest rail bridge on Chenab river can stand quakes, blasts - Sakshi

కౌరి(జమ్మూకశ్మీర్‌): అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్‌ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.

నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్‌ టవర్‌ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్‌ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్‌–రేసి–అనంత్‌నాగ్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.

Advertisement
Advertisement