ప్రభుత్వ భూదాహాన్ని ఎండగట్టండి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూదాహాన్ని ఎండగట్టండి

Published Tue, Dec 6 2016 1:33 AM

ప్రభుత్వ భూదాహాన్ని ఎండగట్టండి - Sakshi

- పార్టీ నేతలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
-  సర్కారు నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- ఆరు జిల్లాల నేతలతో ‘గడప గడపకూ వైఎస్సార్’ పురోగతిపై సమీక్ష
- కార్యక్రమం అమలు తీరుపై సంతృప్తి
- మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచన

 
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సారవంతమైన భూములను బలవంతంగా లాక్కుంటున్న టీడీపీ ప్రభుత్వ భూదాహాన్ని ప్రజల్లో ఎండగట్టాలని వైస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదా వరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఆయా జిల్లాల్లో కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. నేతలకు కొన్ని సూచనలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ చంద్రబాబు సర్కారు సాగిస్తున్న నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

అందువల్ల పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రజలకు మరింతగా చేరువ కావడానికి ప్రయత్నించాలని చెప్పారు. ప్రభుత్వ భూ కుంభకోణాలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవం వంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా రైతన్నల ఆర్తనాదాలు ప్రభుత్వం చెవికెక్కడం లేదని దుయ్యబట్టారు. గడప గడపకూ వైఎస్సార కార్యక్రమం పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కిందిస్థారుు నుంచి కార్యకర్తలను కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు.
 
 ఆరోగ్యశ్రీని నీరు గారుస్తున్నారు
 పేద రోగుల పాలిట సంజీవని అరుున ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 9వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాల్లో నిరుపేద రోగులను, సాధారణ ప్రజలను భాగస్వా ములను చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులను నిలిపివేయడం దారు ణమని అన్నారు. సమీక్షా సమావేశంలో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనమండలిలో పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజు తదితర నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement