కాకాణిపై మండలి చైర్మన్‌కు సోమిరెడ్డి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

కాకాణిపై మండలి చైర్మన్‌కు సోమిరెడ్డి ఫిర్యాదు

Published Tue, Jan 17 2017 1:32 AM

కాకాణిపై మండలి చైర్మన్‌కు సోమిరెడ్డి ఫిర్యాదు - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సర్వేపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తనపైన, తన కుటుంబ సభ్యులపైన అసత్య ఆరోపణలు చేశారని, ఆయనపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సోమవారం ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎ. చక్రపాణికి ఫిర్యాదు చేశారు. కాకాణి ఆరోపణలతో తన హక్కులకు భంగం కలిగిందని, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నంత మాత్రాన ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని నకిలీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేయడం తగదని సోమిరెడ్డి అన్నారు.

భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా నిరోధించాలని పేర్కొన్నారు. తన ఫిర్యాదును శాసనమండలి సభాహక్కుల కమిటీకి పంపించాలని ఆయన చక్రపాణిని కోరారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ వి.సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, శిల్పా చక్రపాణిరెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, వాకాటి నారాయణరెడ్డి వెంట రాగా ఆయన మండలికి వెళ్లి తన ఫిర్యాదును అందించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫిర్యాదును సభా హక్కుల సంఘానికి నివేదిస్తానని మండలి చైర్మన్‌ హామీ ఇచ్చినట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement