సినీచిత్ర పరిశ్రమను జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా క్షీరపరి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవాన్ని పాలకొల్లు పట్టణంలో డిసెంబర్లో నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వహణకమిటీ కన్నీనర్ డాక్టర్ కేఎస్పిఎన్ వర్మ చెప్పారు. భీమవరం త్యాగరాజభవనంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో చిత్రోత్సవ వివరాలను వెల్లడించారు. ప్రధానంగా డెల్టాప్రాంతంలోని భీమవరం, పాలకొల్లు పట్టణాలకు చెందిన అనేకమంది సినీపరిశ్రమలో మకుటంలేని మహరాజుల్లా వెలుగొందుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యువత, విద్యార్ధులో నిఘాఢంగా దాగివున్న కళను వెలికి తీయడానికి లఘుచిత్రాల ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. చిత్రోత్సవకమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ 2015లో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈపోటీలకు ఎంపికైన ప్రతి లఘు చిత్రానికి రూ.అయిదువేలు పారితోషికం ఉంటుందన్నారు. ప్రధమబహుమతిగా రూ. 60 వేలు, ద్వితీయబహుమతిగా రూ.40 వేలు, తృతీయబహుమతిగా రూ.20 నగదుతోపాటు జ్ఞాపికలు అందచేస్తామన్నారు. సందేశాత్మకం, సాంకేతిక నైపుణ్యం కలిగిన వాటికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. విజయవంతమైన లఘుచిత్రాలు తీయడం ద్వారా పెద్ద సినీమాలకు అవకాశాలు దక్కించుకోవచ్చునన్నారు. చిత్రపరిశ్రమలోని నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారన్నారు. లఘు చిత్రాలు 15 నిముషాల నిడివితో ఎంపీ4, బ్లూరేఫార్మెట్తో ఉండాలని చెప్పారు. ఈసందర్భంగా చిత్రోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో రావూరి వెంకటఅప్పారావు, కే శిరాజు రాంప్రసాద్, చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.