కోడూరులో వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

కోడూరులో వ్యక్తి దారుణ హత్య

Published Sat, Jun 30 2018 12:00 PM

Murder In Koduru Man When Deep Sleep Krishna - Sakshi

ఎ.కొండూరు (తిరువూరు) : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఎ.కొండూరు మండలం కోడూరులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడూరు గ్రామానికి చెందిన మట్టగుంజ మోషేరావు అలియాస్‌ మోషే (36) తిరువూరు మండలం వావిలాలకు చెందిన శారదతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పనులు ముగించుకుని గురువారం మోషే ఇంటికి వెళ్లి నిద్రిస్తుండగా కొందరు అతని తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న నూజివీడు డీఎస్పీ సీహెచ్‌వీ ప్రసాద్, మైలవరం సీఐ పి. రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌లు పరిశీలించి నమునాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు సీఐ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై జేవీ రమణ తెలిపారు.

తల్లడిల్లిన కుమార్తెలు..
మృతుడి పెద్ద కుమార్తె ప్రసన్నకుమారి రెడ్డిగూడెం మండలం రంగాపురం కేజీబీవీలో ఇంటర్‌ చదువుతోంది. రెండవ కుమార్తె ప్రత్యూష కోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. వీరు తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement