సాక్షి, వైఎస్సార్ : తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘమిత్ర అనే కార్యక్రమంతో ఓట్లు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వేంపల్లిలో మండల బూత్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంను శనివారం నిర్వహించారు. ఈ సమావేశాంలో మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్ కుమార్, ఎంపీపీ రవికుమార్ రెడ్డి, జడ్పిటీసీ షబ్బీర్ వలి, కన్వీనర్ చంద్ర ఓుబుల్ రెడ్డి, జిల్లా బూత్ కమిటీ ఇంచార్జ్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర కార్యాలయం సలహా మేరకు మండల స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పితే ప్రతి రైతు ఉపయోగిస్తున్న ఉచిత కరెంట్, ఫీజు రియంబర్స్మెంట్, వివిధ సంక్షేమ పథకాలు గుర్తుకువస్తాయి. చంద్రబాబు పేరు చెప్పితే మోసం, వంచన తప్ప ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదు. కేవలం పదిశాతం పనులు పూర్తి చేసి అంతా మేమే చేశాం అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రతీ ఒక్క బూత్ కమిటీ సభ్యుడు, కన్వీనర్ తన పోలింగ్ బూత్పైనే దృష్టి కేంద్రీకరించాలి. పార్టీ కోసం మీరు చేస్తున్న కృషి, శ్రమకు శిరస్సు వంచి సమస్కరిస్తున్న’ అని పేర్కొన్నారు.
కడపలో లక్షా ఇరవైవేల ఓట్లు గల్లంతు అయ్యాయని, ప్రతీ బూత్ కమిటీ కన్వీనర్ శ్రద్దగా పని చేయాలని అప్పుడు ఓట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉందని పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న తపన ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి అన్నారు. భావి తరాలకు ఒక దిశ దశను చూపించే నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు.