ఎమ్మెల్యే రోజా దాతృత్వం
ప్రభుత్వ స్కూళ్లకు రోజా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఫ్యాన్లు వితరణ
స్కూళ్లు ప్రారంభమై నెలవుతున్నా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించకపోతే ఎలా ?
టీడీపీ సర్కారు నిర్లక్ష్యం కనిపిస్తోంది
కేంద్రమంత్రి గడ్కరీ రాకతో బాబుకు భయం ఎమ్మెల్యే ఆర్కే రోజా
వడమాలపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తన చారిటబుల్ ట్రస్ట్ తరఫున వడమాలపేట మండలంలోని అన్ని ప్రభుత్వ ఎంపీపీ, ఎంపీయూపీ స్కూళ్లకు సీలింగ్ ఫ్యాన్లు వితరణగా అందించి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. బుధవారం ఆమె ఎస్వీపురం గ్రామంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ఫ్యాన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకున్నా తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు తనవంతు సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల కావొస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.
పైకేమో ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతూనే పరోక్షంగా కార్పొరేట్లను ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు. చివరి వరకు అరకొర వసతులు కల్పించి చివరి నిమిషంలో పర్సెంటేజీలు రాలేదని, ఉత్తీర్ణత సాధించలేదని టీచర్లను నిందిస్తే వాళ్లు మాత్రం ఏం చేయగలరని ఆమె ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే చాలా స్కూళ్లలో తాగునీటి సౌకర్యం సరిగా లేదని, తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాంపౌండ్ గోడలు లేవని, కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలు కింద కూర్చుని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారని అన్నారు. దీంతో పేదలు అప్పులు చేసి వారి పిల్లల భవిష్యత్ కోసం కార్పొరేట్ స్కూళ్లలో తమ పిల్లలను చేరుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మురళీధర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సురేష్కుమార్, సర్పంచ్ చంద్రమ్మ, ఎంఈఓ పద్మావతి, నాయకులు పాల్గొన్నారు.
గడ్కరీ రాకతో బాబుకు వణుకు..
విజయపురం : పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని తెలియగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టి పరుగులు తీస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె నగరిలో విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు బీజేపీపై వేసిన నిందను నిరూపించుకునేందుకు గడ్కరీ వస్తుంటే ఎక్కడ తాను తీసుకున్న కమీషన్లు, టెండర్లలో జరిగిన అవినీతి బాగోతాలు బయట పడతాయోనన్న భయంతో సెటిల్మెంట్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లా ప్యాకేజీలు తనకు వద్దంటూ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ఘనత టీడీపీదని ఆమె విమర్శించారు. ఒకేసారి ఎన్నికలు మేలని 2017లో చంద్రబాబు చెప్పలేదా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు అనుకూలంగా లేరని, బీజేపీతో కుమ్మక్కై జమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ సపోర్టు చేస్తుందని టీడీపీ నిందవేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మీరు చేస్తే చాగంటి ప్రవచనాలు, అదే వైఎస్సార్సీపీ చేస్తే కుమ్మక్కయ్యారని నింద వేస్తారా అని ఎమ్మెల్యే రోజా టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.