గొట్టుముక్కల (కంచికచర్ల) : అమెరికాలో మృతి చెందిన కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున(33) భౌతికకాయం ఆదివారం స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత చదువుల కోసం 11 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి ఉద్యోగంలో స్థిరపడిన నాగార్జున తన ఐదుగురు స్నేహితులతో కలసి ఈ నెల 2వ తేదీ అమెరికాలోని నార్త్కరోలియా ప్రాంతంలో చార్లెట్ అనే ప్రదేశంలోని జలపాతంలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నాగార్జున భౌతికకాయం గ్రామానికి చేరుకోగానే అతని తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత, సోదరుడు యశ్వంత్ బోరున విలపించారు.
కుటుంబానికి ఆసరాగా నిలబడతాడని అనుకున్న బిడ్డ జలపాతంలో పడి మృత్యువాత పడ్డాడని తల్లి రాజేశ్వరి బోరున విలపిస్తున్న తీరును చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నాగార్జున భౌతికకాయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు గొట్టుముక్కల చేరుకుని నివాళులర్పించారు. ట్రాక్టర్పై ఊరేగింపుగా నాగార్జున భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీపీ వేల్పుల ప్రశాంతి, జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు, ఏఎంసీ చైర్మన్ ఎన్.లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు నాగార్జున భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.